Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల గడువు పెంపు

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ఈమేరకు ప్రజా భవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు.

నిరుద్యోగ యువత వారి కాళ్లపై వారు నిలబడాలన్న మహోన్నత ఆశయంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి పదివేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, అధికారులు అంతా మనసుపెట్టి పనిచేయాలని, నిరుద్యోగులకు సేవ చేసే భాగ్యం ఈ పథకం ద్వారా అధికారులకు కలుగుతుందని డిప్యూటీ సీఎం సూచించారు. దశాబ్ద కాలంగా నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది అని వివరించారు.

ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకునేందుకు యువత కష్టపడిందని, చిన్న పొరపాటు వచ్చిన అధికారులు వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని భట్టి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సమీక్షిస్తామన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్… అన్ని వర్గాల గురించి ఆలోచించి మొదటిసారి చేస్తున్న స్వయం ఉపాధి పథకమిదని చెప్పారు. గతంలో మంజూరీ అయినా చివరి వరకు నిధులు విడుదల చేయలేదని అన్నారు.

దరఖాస్తుధారులు ఎంపీడీఓ కార్యాలయాలు, మునిసిపాలిటీలో నేరుగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలకు పథకానికి సంబందించిన పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. వరుస సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న అర్హులకు మంజూరు లెటర్లు ఇవ్వాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ మొదలు గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు.

Popular Articles