Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

సింగరేణి కార్మికులకు శుభవార్త

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది. సింగరేణి కార్మికులకు రూ. 819 కోట్ల మొత్తాన్ని బోనస్ గా ప్రకటించింది. మొత్తం లాభాల్లో 34 శాతాన్ని బోనస్ గా అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ సోమవారం మీడియా సమావేశంలో సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదని, రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను తమ పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందన్నారు. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని, అందుకే సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాలు పంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని చెప్పారు.

సింగరేణి మొత్తం ఆదాయం రూ.6394 కోట్లు కాగా, ఇందులో రూ. 4,034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించామని, రూ. l2,360 కోట్లు నికర లాభాలు వచ్చాయని, అందులో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించినట్లు చెప్పారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5000 బోనస్ అందించామని, ఈసారి కాంట్రాక్టు కార్మికులకు రూ. 5,500 బోనస్ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారని, ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్ లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు.

ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, భవిష్యత్ లో కార్మికులకు అండగా ఉంటామని, సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామని సీఎం చెప్పారు. కాగా కార్మికులకు దీపావళికి కూడా బోనస్ ప్రకటిస్తామని చెప్పారు. కాగా కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని, తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని డిమాండ్ చేస్తునట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Popular Articles