Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం శుభవార్త

ఖమ్మం: సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. దీపావళి బోనస్ కింద రూ. 400 కోట్ల మొత్తాన్ని సింగరేణి కార్మికులకు చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి కట్టుబడి ఉందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ సర్వే నిర్వహించామని, సర్వే వివరాలు తో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ కు పంపామన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో స్థానిక ఎన్నికల సమయంలో స్థానిక సంస్థలలో 50% పెంచకుండా క్యాబ్ విధిస్తూ చట్టం తీసుకువచ్చిందని, ఆ చట్టాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చామన్నారు.

ఇందుకు సంబంధించి అన్ని దశల్లో అవసరమైన చర్యలు చేపడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్ని నెలలుగా బీసీ చట్టం అమల్లోకి రాకుండా అడ్డుకుంటున్నదని భట్టి ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని, బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలిసిందన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా కేంద్ర నుంచి అనుమతి ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

బీసీలకు ఇచ్చిన హామీని తు.ఛ. తప్పక పాటించేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టి అన్ని పార్టీలను ఆహ్వానించగా, దేశంలోని ఇతర పార్టీలన్నీ మద్దతు తెలియజేయగా, కేవలం బీజేపీ ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసును గెలిచేందుకు దేశంలో అనుభవిజ్ఞులైన అభిషేక్ మను సింఘ్వి, రవి వర్మ వంటి న్యాయ కోవిదులను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించి కొట్లాడిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసన్నారు.

ఈనెల 18న రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు డిప్యూటీ భట్టి పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ విభాగం అధ్యక్షుడు రామచంద్ర రావులు ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం కోసం సమయం తీసుకోవాలని, నాయకత్వం వహించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బీజేపీ నాయకత్వంలో ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తాము అడిగితే కేంద్ర పెద్దలు సమయం ఇవ్వడం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే బీసీల రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈనెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని భట్టి చెప్పారు.

Popular Articles