హైదరాబాద్: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన 2023 సంవత్సరలో తన దగ్గరగాని, దామోదర రాజనరసింహ, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, మందుల సామేల్ వద్ద అధికార యంత్రాంగంగాని, అక్రమ సంపాదనగానీ లేదని సీఎం రేవంత్ అన్నారు. అప్పటి ఎన్నికల్లో గెలవాలంటే ఆగమ్యగోచర పరిస్థితి ఉందని, అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నవారు ఒకవైపు, ఏ విధంగానైనా సరే, చచ్చినా సరే ఈ ఎన్నికల్లో నిలబడి గెలవాలని, చిత్తశుద్ధితో తమ ప్రయత్నం, తమ యత్నానికి మీరందరూ అండగా నిలబడితే ఈ ప్రజాపాలన, ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మాటలతోనో, మూటలతోనో గెలిచే పని అయితే, 2023లో తాము గెలిచి ఉండేవారం కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్దితో, ఆలోచనతో ప్రజల ముందుకు రావడం వల్లే ప్రజాపాలన ఏర్పడిందని, తమ ప్రభుత్వం కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించిందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణా మాదిగ ఎంప్లాయీస్ కో ఆర్డినేషన్ కమిటీ శుక్రవారం శిల్పా కళా వేదికలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ చేసిన స్పీచ్ లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
- ఈ ప్రభుత్వం మీది.. మీరంతా కోరుకుంటే , ప్రజా పాలన రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు.
- చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోంది.
- పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి.
- ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు.
- ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు,తర్జనభర్జనలు జరిగాయి.
- 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను.
- మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చాను.
- క్రిష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను.
- అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ నాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్ లతో పాటు నన్ను బయటకు గెంటివేశారు.
- నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం.
- కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు.
- నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాను.
- ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు.. బలహీనుల పట్ల నిలబడి కొట్లాడటం అనే గొప్ప లక్షణం ఉన్నవాడు.
- వర్గీకరణ లో న్యాయం ఉంది.. మీరు బలహీనులు కాబట్టే నేను మీకు అండగా నిలబడ్డాను.
- రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్కన నిలబడ్డాను.
- నా ప్రయత్నంలో మంత్రి వర్గ సహచరులు, అధికారులు సమయస్పూర్తిని చూపించి అండగా నిలబడ్డారు.
- సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం మనదే.
- వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోచ్చు.
- ప్రమోషన్లు, ఉన్నత విద్య, భూములు , లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవడం వంటి సమస్యలను పరిష్కరించడం పెద్ద విషయం కాదు.
- ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరు ఆపాలి.
- వెనక నుంచి జరిగే దాడుల విషయంలో మీ జాతి నాకు అండగా ఉండాలి.
- నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి.
- ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు నా ప్రభుత్వ ఉద్యోగులే.
- 99 రోజుల ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకున్నాం.
- అత్యంత వెనుకబాటు తనంలో మాదిగ జాతి ఉంది.. ప్రభుత్వ. ఉద్యోగులు వాళ్లకు అండగా ఉండాలి.
- మీ జాతి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాం..మీ హక్కులను చట్టబద్దం చేసి కాపాడుతాం.
- చట్టబద్దమైన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది.
- గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చింది..చెప్పులు కుట్టుకొమ్మని చెప్పింది.
- బర్రెలు,గొర్రెలు , చేపలు కాదు.. చెప్పులు కుట్టుకున్న జాతి ఈ రాజ్యాన్ని నడపాలి.. కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి.
- తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
- నా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తాను.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీరాకుమార్ ఎలా పనిచేశారో అలాంటి స్పూర్తితో పనిచేస్తా.
- ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు రేవంత్ మాదిగ, బీసీలు రేవంత్ యాదవ్, వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే రేవంత్ ముదిరాజ్ అని, సిక్కులు సర్దార్ రేవంత్ అని అసదుద్దీన్ కు సాయం చేశానని రేవంతుద్దీన్ అని నన్ను అన్నారు.
- ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అందరి వాడిని.
- సీఎంగా వచ్చిన అవకాశాన్ని పది మందికి సహాయం చేయడానికేనని భావిస్తున్నా.
- వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మీ జాతికి చేయూత ఇచ్చినప్పుడే నాకు నిజమైన సంతోషం కల్గుతుంది.

