Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ప్రధాని మోదీతో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈమేరకు శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన ముఖ్యమంత్రి వాటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధానమంత్రిని కోరారు.

ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. గతంలో నిర్మించిన 69 కి.మీ ఫేజ్-I తరువాత నగర విస్తరణకు అనుగుణంగా 76 కి.మీ పొడవుతో ఐదు కారిడార్ల ఫేజ్-II ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. రూ. 24,269 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జాయింట్ వెంచర్ (జెవీ) ప్రాజెక్టులో కేంద్ర వాటా 18 శాతం కాగా, రాష్ట్ర వాటా 30 శాతం. ఇటీవలి కాలంలో చెన్నై, బెంగళూరుకు ఆమోదించిన మెట్రో ప్రాజెక్టుల ఆధారంగా హైదరాబాద్ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.

హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా ఒకేసారి ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పటికే భూ సేకరణలో పురోగతి ఉన్న ఉత్తర భాగం పూర్తయ్యేలోపు దక్షిణ భాగాన్ని చేపట్టకపోతే వ్యయం పెరిగే ప్రమాదం ఉందని వివరించారు. భూసేకరణ వ్యయంలో 50 శాతం భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR)కు సమాంతరంగా 370 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రైల్వే (Regional Ring Railway) లైన్ నిర్మించాల్సిన అవసరం ఉందని, దీనికి కూడా కేంద్రం సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం (బందరు) పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు. ఔషధ ఎగుమతులు, తయారీ రంగ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమలో తెలంగాణ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రముఖ R&D కేంద్రాలు, మౌలిక వసతులు, నైపుణ్యం గల మానవ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రతిపాదించిన ISM ప్రాజెక్టుకు ఆమోదం తెలిస్తే, పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు.

హైదరాబాద్ మొదటి నుంచి రక్షణ రంగంలో కీలకంగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగంలో MSMEలకు ప్రోత్సాహం అవసరమన్నారు. హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు సమానంగా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

అంతకు ముందు జరిగిన నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ 10వ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భారత్‌ మరింత అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం, సమాఖ్య స్ఫూర్తి అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలను కేవలం ప్రయోగశాలలుగా మాత్రమే కాకుండా జాతీయ వృద్ధికి అవసరమైన చోదక శక్తిగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

సహకార ఫెడరలిజమ్ శక్తిని వినియోగించి సమానత్వం, న్యాయం, శ్రేయస్సుతో పాటు అందరికీ సమాన అవకాశాలు అందించే భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. దేశ సమగ్రాభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణానికి అనుసరిస్తున్న విధివిధానాలు, భవిష్యత్తు లక్ష్యాలను సమగ్రంగా వివరించారు. తెలంగాణ రైజింగ్‌తో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ మాడల్‌ను సమావేశంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో చేపట్టిన అనేకానేక కార్యక్రమాలను సమగ్రంగా వివరించి అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఆర్థిక చేయూతను అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

వన్ ట్రిలియన్ డాలర్ల GSDP సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొద‌టి స్థానంలో ఉండాల‌ని కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. జాతీయ‌ స్థాయి అంచనాల ప్రకారం ఈ లక్ష్యం 15 ఏళ్లలో సాధ్యమవుతుందని భావిస్తున్నామన్నారు. కానీ, ఈ ప్రయాణాన్ని వేగవంతం చేసి ప‌దేళ్ల‌లోపే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో తెలంగాణ ఉందన్నారు. వచ్చే 2047 సంవత్సరం నాటికి జాతీయ జీడీపీకి తెలంగాణ 8 శాతం, అంటే 2.4 ట్రిలియన్ల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసి తెలంగాణ జాతీయ లక్ష్యాలకు చోదకంగా నిలబడుతుందన్నారు. దేశంలో ఇప్పటికే పారిశ్రామిక, సాంకేతిక, పరిపాలనా సంస్కరణల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండటం గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

దాదాపు వందకు పైగా అంశాలతో తెలంగాణ రైజింగ్ ఎజెండాను సమగ్రంగా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పరం సహకారం, సమన్వయం ఉండాలని అభిలషించారు. దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి తెలంగాణ సంపూర్ణంగా సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Popular Articles