డిల్లీ: తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బుధవారం భేటీ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ – 2047 గ్లోబల్ సమ్మిట్’కు రావాలంటూ ప్రధాని మోడీని ప్రత్యేకంగా సీఎం ఆహ్వానించారు. పార్లమెంట్లో ప్రధానితో జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం ప్రధానికి అందించారు.
కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం రేవంత్ ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ ను గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నట్లు సీఎం ప్రధానికి వివరించారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు గుజరాత్ మోడల్ కు మద్ధతునిచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి గుర్తు చేశారు. మన్మోహన్ మద్ధతుతో గుజరాత్ మోడల్ ను రూపొందించారని చెప్పారు. మన్మోహన్ సింగ్ గుజరాత్ కు సహకకరించినట్లుగా తెలంగాణాకు సహకరించాలని సీఎం ప్రధానిని కోరారు. మీ సహకారంతో తెలంగాణా మోడల్ ను సృష్టిస్తానని పేర్కోన్నారు. హైదరాబాద్-చెన్నయ్-బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇవ్వాలని, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అనుమతినివ్వాలంటూ పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు.

అదేవిధంగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించి ఆహ్వాన పత్రికను అందించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ భేటీలో ఉన్నారు.

