హైదరాబాద్: నదీ జలాల వివాదంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. నదీ జలాలకు సంబంధించి పంచాయతీ కావాలా..! నీళ్లు కావాలా..! అని అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని కోరుకుంటామని స్పష్టం చేశారు. నదీ జలాలపై రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం భావించడం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని సీఎం అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో నెలకొల్పిన సుజెన్ మెడికేర్ (Suzen Medicare) ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ తెలంగాణ జల వివాదాలను ప్రస్తావించారు. “పక్క రాష్ట్రాలతో తెలంగాణ వివాదాలను కోరుకోవడం లేదు. న్యాయస్థానాల ముందుకు లేదా మరెవరి వద్దనో పంచాయతీ పెట్టుకునే కన్నా సమస్యపై కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. నీటి వివాదాల విషయంలో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది. అభివృద్ధి సాధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం, సయోధ్య ఉండాలి. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలి..” అని పక్క రాష్ట్ర పాలకులను ఉద్ధేశించి విజ్ఞప్తి చేశారు.

కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించరాదని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. జల వివాదాలపై శాశ్వత పరిష్కారం, రాష్ట్ర ప్రయోజనాలపై వివాదాలను కోరుకోవడం లేదని, సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల వల్ల పర్యావరణం, సీడబ్ల్యూసీ నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు, అనుమతులు కూడా రావడం లేదని, తద్వారా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని చెప్పారు.
రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నామని, పరస్పర సహకారం అవసరమని అన్నారు. పోర్టు కనెక్టివిటీ లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగామని, ఆ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని చెప్పారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని, పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పరస్పర సహకారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యల సంపూర్ణ పరిష్కారం కోసం ముందుంటామని అన్నారు.

తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తూ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని వివరించారు. తెలంగాణ ప్రపంచంలో జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ లతో పోటీ పడాలని సంకల్పించామని, అందులో భాగంగానే యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ వాటిల్లో పోటీ పడగలుగుతున్నాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి పారిశ్రామిక, విద్యుత్, పర్యాటక, దేవాదాయ, వైద్య రంగాల్లో ప్రభుత్వం పాలసీలు తీసుకొచ్చిందని, విద్యా రంగంలోనూ సరికొత్త పాలసీని ప్రకటించబోతున్నామని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడానికి పారదర్శకమైన ప్రణాళికలు రూపొందించామని, భారత్ ఫ్యూచర్ సిటీ వల్ల ఇక్కడి భూముల ధరలు పెరుగుతాయన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని, అందరి సహకారం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

