Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

తెలంగాణా కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

హైదరాబాద్: ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణా మంత్రివర్గ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధన తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తీసుకున్న ముఖ్య నిర్ణయాలను, విశేషాలను రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. ఇవీ ముఖ్యాంశాలు:

  1. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో రాష్ట్రంలో 80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది.

• కేంద్ర ప్ర‌భుత్వం 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సేక‌ర‌ణ‌కు అంగీక‌రించింది.. మ‌రో 15 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులుసేక‌రించాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

• వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్ల‌ను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని కేబినెట్ నిర్ణయించింది.

• వ్య‌వ‌సాయ, రెవెన్యూ, పౌర‌ స‌ర‌ఫ‌రాల, ర‌వాణా శాఖల స‌మ‌న్వ‌యంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ చేపట్టాలని నిర్ణయించింది.

• ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ. 500 బోన‌స్ రైతుల ఖాతాల్లో వెంట‌ వెంటనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

• క‌లెక్ట‌ర్లు, అద‌న‌పుక‌లెక్ట‌ర్లు కొనుగోలు కేంద్రాల‌ను త‌నిఖీ చేయాలని, ప్ర‌తి కొనుగోలు కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మ‌న్వ‌యానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్య‌త‌లు అప్ప‌గించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

  1. రాష్ట్రంలో కొత్తగా మూడు (3) అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్ లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
  2. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  3. ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధన ను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది.
  4. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డుకు ప‌ది ఎక‌రాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
  5. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
  6. నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసింది.
  7. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.

మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సీఎస్ ఛైర్మన్ గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారు.

అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.

  1. రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొద‌టి ద‌శ‌లో 5,566 కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ ర‌హ‌దారులు, జిల్లా కేంద్రాలు, మండ‌ల కేంద్రాలు, ప‌ర్యాట‌క ప్రాంతాలు, ఇత‌ర రాష్ట్రాల‌తో అనుసంధాన‌మ‌య్యే ర‌హ‌దారుల‌కు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టనున్నారు.
  2. ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వ‌ర‌కు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి ర‌క్ష‌ణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్ర‌త్యామ్నాయంగా 435.08 ఎక‌రాల భూముల‌ను అప్ప‌గిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.
  3. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేక‌ర‌ణ‌కు అయ్యే రూ.438 కోట్ల వ్య‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేందుకు అంగీక‌రిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది.
  4. మ‌న్న‌నూర్‌-శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేందుకు అంగీక‌రిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.

Popular Articles