హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నుంచి పిలుపు అందింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సిట్ అధికారులు సంతోష్ కు నోటీసు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 3.00 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు తమ నోటీసులో పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులో జోగినపల్లి సంతోష్ ను రాజ్యసభ సభ్యునిగా పేర్కొనడం గమనార్హం. తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు హాజరవుతానని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు.


