హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి మొదటి దశ ఎన్నికలు నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సాధారణ, వ్యయ పరిశీలకులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా, మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో మొదటి విడతలో 3,834 గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు, 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు, 56,19,430 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో సర్పంచ్ పదవికి 12,960 మంది, వార్డులకు 65,455 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఓటరు స్లిప్పు కేవలం సమాచారం కోసమేనని, దీనిని గుర్తింపు పత్రంగా (Identity Proof) పరిగణించరని చెప్పారు. ఓటు వేయడానికి ఓటరు జాబితాలో పేరు ఉండటం తప్పనిసరిగా పేర్కొన్నారు. ఓటర్లు తమ గుర్తింపు కోసం ఎపిక్ కార్డు (ఓటరు ఐడి) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదో ఒక దానిని చూపించవచ్చని స్పష్టం చేశారు.
- ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్,
- పాన్ కార్డు, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ (ఫోటోతో),
- రేషన్ కార్డు (ఫోటోతో),
- పట్టాదారు పాస్బుక్,
- ఉపాధి హామీ జాబ్ కార్డు,
- దివ్యాంగుల ధృవీకరణ పత్రం (ఫోటోతో), పెన్షన్ పత్రాలు, మొదలగునవి చూపించి, ఓటు వేయవచ్చని అన్నారు.
పోలింగ్ ప్రారంభానికి ఒక గంట ముందు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిషేధించినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి మద్యం అమ్మకాలు, పంపిణీపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే, పోలింగ్ కేంద్రాలలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఫలితాల ప్రకటన అనంతరం వెంటనే ఉప-సర్పంచ్ ఎన్నిక నిర్వహించబడుతుందని తెలిపారు.
ఓటర్లందరూ తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు పోలింగ్ 2 గంటల తర్వాత తదుపరి వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు.

ఖమ్మం: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం జిల్లా పరిధిలో మొదటి విడత డిసెంబర్ 11న ఏడు మండలాల పరిధిలోని 192 గ్రామ పంచాయతీల్లో 20 ఏకగ్రీవం కాగా, 172 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా 1,740 వార్డులకుగాను 2 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, 323 వార్డులు ఏకగ్రీవం కాగా, 1,415 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 2 లక్షల 41 వేల 137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని, ఇందులో ఒక లక్షా 16 వేల 384 మంది పురుషులు, లక్షా 24 వేల 743 మంది మహిళలు, ఇతరులు 10 మంది ఉన్నారని తెలిపారు. మొదటి దశ 192 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక కొరకు 488 మంది బరిలో ఉన్నారని చెప్పారు. అదేవిధంగా 1,415 వార్డులలో 3424 మంది పోటీలో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

