స్థానిక ఎన్నికల నిర్వహణపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాలవారీగా పార్టీ ముఖ్యులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణపై మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ ఆయన మాటల్లోనే..

- ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్.
- రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తాం.
- తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ.
- అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ.
- ఆయా గ్రామాల్లో పార్టీ నాయకుల మధ్య సఖ్యత ఉండాలి.
- నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.
- ఎన్నికలకు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది. కాబట్టి మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కండి.
- రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది.
- ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరి చేర్చడం జరిగింది.
- వచ్చే వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుంది.
- సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే.
- మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు… వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి.
