తెలంగాణాలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు జరుగుతున్న ప్రచారంపై రాజ్ భవన్ అధికారులు స్పందించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియరైనట్లు, పంచాయత్ రాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై రాజ్ భవన్ అధికార వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఈ అంశంలో వ్యాప్తిలోకి వచ్చిన వార్తలను రాజ్ భవన్ వర్గాలు కొట్టిపారేస్తూ, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగులోనే ఉందని, ఈ బిల్లుపై గవర్నర్ ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని వివరించాయి. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో ఈ అంశంలో గందరగోళం నెలకొన్నట్లు రాజ్ భవన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.


