ఖమ్మం: పరుగెడుతున్న రైలులో కనిపించిన ఓ కొండ చిలువ ప్రయాణీకులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అండమాన్ ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై ప్రయాణీకులు, ఆర్పీఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెడితే.. అండమాన్ ఎక్స్ ప్రెస్ రైలు విజయవాడ వైపు సోమవారం సాయంత్రం వెడుతుండగా, S2 స్లీపర్ కోచ్ లో కదలాడుతున్న కొండచిలువను టీటీఈ వెంకటేశ్వర్లు గమనించారు.

రైలు అప్పటికే డోర్నకల్ దాటి విజయవాడవైపు వేగంగా పరుగెడుతోంది. కొండ చిలువను గమనించిన టీటీఈ వెంకటేశ్ర్లు విషయాన్ని వెంటనే ఆర్పీఎఫ్ సీఐ సురేష్ గౌడ్ కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఆయన వెంటనే స్నేక్ క్యాచర్ మస్తాన్ కు సమాచారం అందించి రైల్వే స్టేషన్ కు పిలిపించారు. ఖమ్మం స్టేషన్ లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫాంపైన రైలును ఆపి బోగీలో ఉన్న కొండచిలువను పట్టించారు. ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొండచిలువను స్నేక్ క్యాచర్ మస్తాన్ పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ మస్తాన్ ను ఆర్పీఎఫ్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.


