Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: ఎమ్మెల్సీ కవిత

బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామనడం దారుణమని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాలతో ఖమ్మంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీలు 46 శాతం ఉన్నారని, రీ సర్వే చేస్తే మరో 1.5 లేదా 2 శాతం బీసీల జనాభా పెరుగుతుందన్నారు. అంటే మొత్తం బీసీల జనాభా దాదాపు 48 శాతం ఉంటుందని అంచనా వేశారు. 48 శాతం బీసీలు ఉంటే ఏ ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఈ మూడు రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క అంశంపై అయినా ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం బిల్లు చెల్లకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మూడు రంగాలకు సంబంధించి వేర్వేరు బిల్లులను పెట్టాలని డిమాండ్ చేశారు. ముస్లీంలు, బీసీలకు కలిపి మొత్తం 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. రిజర్వేషన్ల విషయంలో హిందువులు, ముస్లీంలకు మధ్య బీజేపీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ముస్లీంల జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు కల్పించాలని, ముస్లీంల పేరు చెప్పి ఆయా వర్గాల మధ్య పంచాయతీ పెట్టవద్దని సూచించారు.

తన నివాసంలో కవితకు మొక్కను బహుకరిస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

గ్రామాల వారీగా ఏ కులంలో ఎంత జనాభా ఉందో ప్రభుత్వం బయటపెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఇప్పటి వరకు ప్రభుత్వం బయపెట్టలేదని, దాన్ని కూడా వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా లెక్కలు సరైనవా? కావా? అన్నది ప్రజలు తేల్చుకోగలుగుతారని తెలిపారు. సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, రీ సర్వేకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని , టోల్ ఫ్రీ నెంబరులో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

అక్రమ కేసులకు తలొగ్గేదే లేదు, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం:
ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించిన బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులతో కలిసి ఖమ్మం జైలులో కవిత పరామర్శించారు.

ఖమ్మం జైలు ముందు మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. అక్రమ కేసులతో కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, కానీ కేసీఆర్ ని, ఆయన సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా తమను ఆపలేరన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్ని, మోసాలన్నీ ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయని, రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయని తెలిపారు.

14 నెలల పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అందరికీ తెలిసిపోయిందని, ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని చెప్పారు. గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సురేందర్ పై అక్రమ కేసు నమోదు చేసి జైలు పంపారని, ప్రభుత్వం నడపడం చేతగాక, పథకాలు అందించడం చేతకాక వైఫల్యాలను కప్పిపెట్టుకుంటామంటే కుదరదని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటామ, అక్రమ కేసులకు తలొగ్గేదే లేదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని కవిత అన్నారు.

Popular Articles