రైతులకు సాగునీరు అందించే మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసుకున్నామన్నారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, ల్యాబ్, ప్రెజర్ మెయిన్స్, కంట్రోల్ ప్యానెల్స్, మోటార్ల ఏర్పాటు వంటి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈఈ, డిఈ లు జరుగుతున్న పనుల పురోగతిని మంత్రికి వివరించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మిగిలి ఉన్న ప్రెజర్ మెయిన్స్ పనులు మార్చి 25 లోపు పూర్తి చేస్తామని, మార్చి 17 నాటికి మొదటి స్లాబ్ నిర్మాణం అయిపోతుందని, ఆ తదుపరి నాగార్జున సాగర్ కాలువ నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా పనులు చేపడతామని చెప్పారు.
రైతులతో ఎటువంటి సమస్య లేకుండా సమన్వయం చేసుకుంటూ ఉండాలని, రైతుల పంటలకు నష్టం జరగకుండా పనులు వేగవంతం కావాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట నీటి పారుదల శాఖ ఈఈ అనన్య, డీఈఈ ఝాన్సీ, ఏఈఈ శ్రీరామ్, రాజీవ్ గాంధీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

