హైదరాబాద్: తెలంగాణాలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ అంశంలో ప్రకటన చేశారు. గత పాలకులు చేసిన అశాస్త్రీయ జిల్లాల పునర్విభజనను సరిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇష్టానురీతిలో జరిగాయన్నారు.
తమను పొగిడినవారికి ఒక విధంగా, పొగడని వారికోసం మరో విధంగా,అదృష్ట సంఖ్యను ఊహించుకొని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని పొంగులేటి వ్యాఖ్యానించారు. అందువల్ల అశాస్త్రీయంగా జరిగిన మండలాలు,రెవెన్యూ డివిజన్లను, జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం ఆమోదంతో, అసెంబ్లీలో చర్చించి సరైన పద్దతిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని మంత్రి ప్రకటించారు.
కాగా 2014 సంవత్సరానికి ముందు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకానికి మంజూరు, బకాయిపడ్డ బిల్లుల కోసం రూ. 388 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. రాష్ట్రంలో అర్హత గల, ధ్రువీకరించిన ఏ బిల్లులు కూడా ప్రభుత్వం వవద్ద పెండింగులో లేవని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

