హైకోర్టు తీర్పునకు లోబడి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోను జారీ చేసి ఎన్నికలకు సిద్ధమైందన్నారు. ఆ జాబితా ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ఇప్పటికే ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ అనే జాబితా వెలువడిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొందరు హైకోర్టులో సవాలు చేశారని, అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు తీర్పు వెలువడనుందని, ఆ తీర్పును స్వాగతిస్తూ, కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కూసుమంచిలోని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలాల వారీగా సోమవారం ఆయన పార్టీ పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, మొదటి విడతలోనే పాలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా గ్రామాల్లోని ప్రతీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. ‘ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి’ అని మంత్రి అన్నారు.

గ్రామాల్లో విభేదాలు ఉన్నా వాటిని చర్చల ద్వారా పరిష్కరించి ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం ప్రతి మండలానికి తొమ్మిది మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఒకే గ్రామం నుండి అనేక మంది ఆశావహులు ఉన్నప్పుడు గెలుపు అవకాశాలు, పార్టీపై విధేయతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. రిజర్వేషన్ల కారణంగా పోటీకి దూరమైన వారికి వేరే అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా హెచ్చరించారు.

