ఖమ్మం: ఖమ్మం కామ్రేడ్స్ కు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ల ద్వారా తమ కార్యకర్తలను బెదిరిస్తే ఊర్కునేది లేదని, బొక్కలో వేయిస్తానని హెచ్చరించారు. పోలింగ్ ముగిసిన 11వ తేదీ తర్వాత సంగతి తేలుస్తానని వారిని హెచ్చరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పొంగులేటి ఈ హెచ్చరిక చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల పొత్తు కుదరని పరిస్థితుల్లో, ఏదులాపురం, కొత్తగూడెంలలో కాంగ్రెస్, సీపీఐ వేర్వేరుగా పోటీచేస్తున్న పరిస్థితుల్లో మంత్రి పొంగులేటి చేసిన ఈ హెచ్చరిక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ వ్యాఖ్యల సందర్భంగా పొంగులేటి సీపీఐ పేరును నేరుగా ఉటంకించకపోవడం గమనార్హం. పరోక్షంగా ఈ హెచ్చరిక వారిని ఉద్ధేశించి చేసినట్లుగానే పొలిటికల్ చర్చ జరుగుతోంది. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి పొంగులేటి చేసిన ఈ హెచ్చరికల వ్యాఖ్యలు ఉన్నది ఉన్నట్లుగా ఆయన మాటల్లోనే…
‘ఎవరైతే రాత్రిపూట ఫోన్లుచేసి.. ఈ ఎన్నికల తర్వాత మేం ఇది చూస్తాము, అది చూస్తామని కారు కూతలు కూస్తే 11వ తారీఖు వరకు ఏమీ అనను. పదకొండో తారీఖు తర్వాత ప్రతీ ఫోన్ కాల్ ను బయటకు తీసి బొక్కలో వేయిస్తాను. భయపడరు.. నా కార్యకర్తలు భయపడరు. పోలీసుకు కూడా చెబుతున్నాను.. భయపెట్టేవాళ్లు ఎవరైనా ఉంటే.. అటువంటి వాళ్లను చట్టరీత్యా ఉక్కుపాదంతో తొక్కాలని కూడా ఈ వేదిక నుంచి ఆదేశిస్తున్నాను. మీ చందాలు, మీ దందాలు.. మీ దౌర్జన్యకాండకు ఈరోజుతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఈ మున్సిపల్ లో ఉన్న ప్రజలు. కాబట్టి ఇకనైనా ప్రజాజీవితంలో, ప్రశాంత వాతావరణంలో మీరు ఎన్నికలు జరపుకోవాలి. ప్రజలు మిమ్మల్ని దీవిస్తే కాదనం, దీవించిన తర్వాత మీరేం చేయాలో కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి చిన్నదానికి కూడా మీరు భయపడక్కర్లేదు.. కొండంత మీ శీనన్న ఇక్కడ ఉన్నాడు.. ఉన్నాడా? ఉన్నాడా? ఓకే కదా..?’

