హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణా రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీఎం సీపీఆర్వో జి. మల్సూర్తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్టుల హెల్త్ పాలసీ, జర్నలిస్టులకు ఇచ్చే అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్ధికశాఖ అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు.


