రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదల సొంతింటి కల నెరవేరబోతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతమైన బెండాలపాడు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం ఒక చరిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ఇది గ్రామ ప్రజలకు సంతోషకరమైన, గుర్తుండిపోయే రోజు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకలను పండుగ వాతావరణంలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం, గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి లోటు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గృహనిర్మాణ శాఖను బలోపేతం చేస్తూ, పేదవారికి న్యాయం జరిగేలా పారదర్శక విధానంలో ఇళ్లను మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక నుండి వారి ఖాతాల్లో నిధుల జమ వరకు మొత్తం ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినా వాటిని వెంటనే గుర్తించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు కొందరిని సస్పెండ్ చేయడం, కేసులను ఏసీబీకి అప్పగించడం కూడా జరిగిందన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వానికి ఓటు వేసిన వారికే కాకుండా, రాజకీయాలు, కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ పథకం వల్ల జిల్లాలోనే సుమారు 21,500 కుటుంబాల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, గృహప్రవేశాల సందర్భంగా లబ్ధిదారులను ఉద్ధేశించి సీఎం ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సంతోషంలో పాలుపంచుకుంటారని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను నిర్వీర్యం చేసి, పేదవారి కలలను దెబ్బతీసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహనిర్మాణ శాఖను తిరిగి బలోపేతం చేసి, లక్షలాది పేదలకు గృహాల కలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ మహత్తర గృహప్రవేశ కార్యక్రమానికి జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర సహచర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొంటారని మంత్రి తెలిపారు.
ఈ పరిశీలనలో మంత్రి పొంగులేటి వెంట గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అశ్వరావుపేట, భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, టీజీ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫొటో: సీఎం పర్యటనపై అధికారులకు సూచనలు చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి