Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

కొండా సురేఖ ఫిర్యాదుపై మంత్రి పొంగులేటి రియాక్షన్

మేడారం: తనపై మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. సోమ‌వారం ఆయ‌న రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ @ సీత‌క్క‌తో క‌లిసి ములుగు జిల్లా మేడారంలోని స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌య అభివృద్ది ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. అనంతరం అధికారుల‌తో క‌లిసి ఆల‌య ప‌నుల ప్రగ‌తిని స‌మీక్షించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ ‘నేనేంటో అంద‌రికీ తెలుసు, రూ. 60- 70 కోట్ల కాంట్రాక్ట్ వ‌ర్క్‌కు తాప‌త్ర‌య‌ప‌డే అవ‌స‌రం నాకు లేదు. నాపై స‌హ‌చ‌ర మంత్రులు ఫిర్యాదు చేశారంటే న‌మ్మ‌డం లేదు. ఫిర్యాదు చేయ‌డానికి ఏమంది? అధిష్టానానికి ఎవ‌రూ ఫిర్యాదు చేసే ఛాన్సే లేదు. నేను కూడా అలా జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌డం లేదు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల మేర‌కు అభివృద్ది ప‌నులు చేస్తున్నాం. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల వంటి సీత‌క్క‌, సురేఖ అక్క‌ల‌తో ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతాను’ అని మంత్రి పొంగులేటి చెప్పారు.

మేడారం జాతర పనులను పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో మంత్రి సీతక్క, అధికారులు

కాగా అశేష భ‌క్తుల కొంగుబంగారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్దికి ప్ర‌భుత్వం రూ. 251 కోట్ల నిధులను ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా 101 కోట్ల రూపాయిలు మంజూరు చేయ‌గా, వీటిలో 71 కోట్ల రూపాయిల‌కు టెండ‌ర్లు పిలిచినట్లు చెప్పారు. గ‌తంలో మంజూరైన 150 కోట్ల రూపాయిల‌తో క‌లిపి ద‌శ‌ల‌వారీగా శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఆల‌యాభివృద్ది చేసేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. మేడారం జాత‌ర‌కు వ‌చ్చే నిధులు జంప‌న్న వాగులో వ‌ర‌ద‌లా కలిసిపోకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే శాశ్వత పనులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.

గిరిజ‌న‌, గిరిజ‌నేత‌రుల ఆరాధ్య‌ దైవాల ప్రాంగ‌ణాల‌ను అభివృద్ది చేస్తామ‌ని, రోడ్లు, ఇత‌ర నిర్మాణాలు సాగిస్తామ‌ని చెప్పారు. మ‌రో 50 రోజుల్లో భక్తులు ఎప్పటిలాగే సందర్శించేాలా ఈ ప‌నుల‌కు ఎటువంటి ఆటంకం లేకుండా ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో సాగేలా క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌కు సూచ‌న‌లు ఇచ్చామ‌న్నారు. ఆల‌యాభివృద్దికి ఎవ‌రు ఎటువంటి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చినా స్వీక‌రిస్తామ‌న్నారు. ఈ ప‌నుల‌ను మంత్రి సీత‌క్క స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తార‌ని చెప్పారు. గ‌తంలో ఈ జాత‌ర‌కు కోటి మందికి పైగా వ‌చ్చినట్లు అధికారులు చెప్పార‌ని ఈ సారి ప్ర‌భుత్వ అభివృద్ది చ‌ర్య‌ల కార‌ణంగా ఈ సంఖ్య రెట్టింపు అవుతుంద‌ని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Popular Articles