ఖమ్మం: నగర శివార్లలోని వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయపరమైన హామీ ఇచ్చారు. ఈ అంశంలో బాధితులకు న్యాయం దక్కేవరకు సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి పోరాడుతామని, ఖర్చు కూడా తమదేనని ఆయన భరోసా ఇచ్చారు. బాధితులకు తాము అండగా ఉంటామని, ఇదే విషయాన్ని కేసీఆర్ చెప్పి పంపారని కేటీఆర్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇదే స్థలంలో బాధితులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈమేరకు కేటీఆర్ గురువారం ఖమ్మంలో పర్యటించి వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేత బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పట్టాలు ఉన్నప్పటికీ, కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం అమానుషమన్నారు. శాసనసభ, శాసనమండలి వేదికలుగా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశంలో బాధితులు ఐక్యంగా ఉండాలని, చీలిపోరాదని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కేటీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

