Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మిర్చి మార్కెట్లో కలెక్టర్.. అధికారులపై ఆగ్రహం

మిర్చి నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ అధికారులపై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన మిర్చికి ధర తగ్గించి, మిర్చి కొనుగోలు విషయమై రైతులను ట్రేడర్లు మోసం చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నాణ్యత మేరకు మిర్చికి ధర రావడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మిర్చి మార్కెట్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మిర్చి మార్కెట్లో తిరుగుతూ పరిస్థితిని పరిశీలిస్తున్న కలెక్టర్

ఈ సందర్భంగా మిర్చి యార్డును కలియదిరిగి కొనుగోళ్ళ తీరును పరిశీలించారు. గిట్టుబాటు ధరకే మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులకు కలెక్టర్ సూచించారు. తేమశాతం కోసం మిరపకాయలు పట్టుకుని నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, సరుకు బాగానే ఉన్నా తక్కువ ధర చెల్లిస్తున్న వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని అధికారులను ప్రశ్నించారు. మార్కెట్​కు వచ్చిన కలెక్టర్ తో మిర్చి రైతులు, మిర్చి ధరలు గణనీయంగా తగ్గిస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. జెండా పాటకు వేలం వ్యత్యాసంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో చాలా నష్టాలు వస్తున్నాయని రైతులు తెలిపారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్ వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

మిర్చి కొనుగోళ్లలో జాప్యం చేయకూడదని, అన్నదాతలకు వెంటనే చెల్లింపులు చేయాలని వ్యాపారులకు సూచించారు. మిర్చి పంట కొనుగోళ్లు సాగుతున్న తీరుపై, జెండా పాటకు, రైతుకు దక్కే ధరకు పొంతన లేదని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు. నాణ్యత పేరుతో రైతులను ఖరీదుదారులు నష్టపరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వారి లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి బస్తా కొనుగోలు అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలు ఏవరు చేసిన ఉపేక్షించబోమని అన్నారు. అన్నదాతలకు న్యాయం జరిగేలా అధికారులు వారికి అండగా ఉండాలని ఆదేశించారు.

రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం మార్కెట్‌ లో రైతులకు గిట్టుబాటు ధర అందేలా నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు. వ్యాపార లావాదేవీలను, సరుకు నాణ్యతను మార్కెట్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఇతర శాఖలను సమన్వయం చేసుకుని, రైతుకు సరైన ధర లభించేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్, మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, అధికారులు, తదితరులు ఉన్నారు.

Popular Articles