- ఖమ్మం నగరంలో అక్రమ ఫైనాన్స్, ఆనాధికార చిట్స్ నిర్వహిస్తున్న వ్యాపారుల ఇండ్లలో పోలీసులు సోదాలు
- వ్యాపారుల నుండి 120 ఖాళీ బ్యాంక్ చెక్స్, 570 ప్రామిసరీ నోట్లు, 38 బాండ్లు స్వాధీనం
- అక్రమ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న ఆరుగురిపై కేసు నమోదు
- ఖమ్మం సిటీ ఏసీపీ రమణమూర్తి వెల్లడి
నిబంధనలకు విరుద్ధంగా చిటీలు, ఫైనాన్స్ పేరుతో గిరిగిరి వ్యాపారం నిర్వహిస్తున్న పలువురి ఇండ్లలో సోదాలు నిర్వహించినట్లు ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రవేటు చిట్స్, అధిక వడ్డీలతో ప్రజలను పీడిస్తున్న ఫైనాన్స్/ గిరిగిరి వ్యాపారుల ఇండ్లలో ఏకకాలంలో 11 చోట్ల దాడులు నిర్వహించి తనిఖీలు చేసినట్లు తెలిపారు.

ఈ దాడుల్లో లక్షల రూపాయల అప్పులు ఇచ్చినట్లు గల 120 ఖాళీ బ్యాంక్ చెక్స్, 570 ప్రామిసరీ నోట్లు, 38 బాండ్లు లభ్యమైనట్లు తెలిపారు.
చిట్ నిర్వహుకులు తమ కస్టమర్ల నుండి సేకరించిన డబ్బును చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, దౌర్జన్యాలు, దాడులు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల ఇండ్లలో తనిఖీ చేసి ఆరుగురు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. అధిక వడ్డీ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రమణమూర్తి హెచ్చరించారు.

