హైదరాబాద్: బంజారాహిల్స్ నందినగర్ లో గల తన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించడాన్ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. అధికారిక రికార్డుల్లో తన చిరునామా నందినగర్ లోనే ఉన్నట్టు పేర్కొన్న సిట్ అధికారులు, సిద్ధిపేట అడ్రస్ గల హరీష్ రావుకు హైదరాబాద్ లో ఎందుకు నోటీసు ఇచ్చారని ప్రశ్నించారు. ఇది సిట్ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులు గోడలకు నోటీసు అంటించడం చట్ట విరుద్ధమని కేసీఆర్ అన్నారు.
తనకు నాకు నోటీసు ఇచ్చే అధికార పరిధి ఏసీపీ వెంకటగిరికి లేదన్నారు. చట్టం ప్రకారం తన స్టేట్మెంట్ను ఎర్రవల్లిలోనే రికార్డ్ చేయాలని, కానీ చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. నందినగర్ నివాసంలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పట్టుబట్టినందున అక్కడే అందుబాటులో ఉంటానని కేసీఆర్ ఏసీపీ వెంకటగిని ఉటంకిస్తూ రాసిన లేఖలో పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..:
- సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకం.
- సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కిన సీట్ అధికారుల తీరు.
- సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదు.
- నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే.
- మొన్న రెండు సార్లు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధం, చట్టాలకు అతిక్రమించి ఇచ్చారు.
- మీరు ఇచ్చిన మొదటి నోటీసుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటం వల్ల వేరే రోజు విచారణకు తేదీ ఇవ్వాలని చెప్పాను.
- దాంతో పాటు 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్ 160 CrPC నిబంధనలను మీ దృష్టికి తెచ్చాను.
- దాంతో పాటు తదుపరి నోటీసులన్నీ కూడా ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పాను.
- కానీ, ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు మీ సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నందినగర్ నివాసంలోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలుస్తోంది.
- ఆ లేఖ మీరే పంపినట్లయితే, మీ సూచనల మేరకే అతికించినట్లయితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను.
- ఇది భారత రాజ్యాంగం, చట్టం మరియు గౌరవ సుప్రీంకోర్టుల పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది.
- గతంలో సుప్రీంకోర్టు ‘సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ’ అనే కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
- వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది.
- CRPC 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలి.
- కానీ మీరు కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు.
- ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది.
- భవిష్యత్తు నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని చెప్పినప్పటికీ మీరు దాన్ని విస్మరించారు.
- కాబట్టి మీరు ఇచ్చిన రెండవ నోటీసు చట్టబద్ధంగా అందలేదు, అది చెల్లదు.
- మీరు ఇచ్చిన నోటీసు నా రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘించడమే.
- నేను మీ పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ నివసించడం లేదు.
- కాబట్టి మీకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. ఈ నోటీసు నన్ను కట్టడి చేసే అధికారం లేదు.
- ఎలక్షన్ అఫిడవిట్ లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని మీరు చెప్పడం సరికాదు.
- నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం.
- నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నాను అన్నది నిర్వివాదాంశం.
- అక్కడే నా స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసిన బాధ్యత మీపై ఉన్నది.
- హరీష్ రావు అఫిడవిట్ లో సిద్దిపేట అని చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్ లో నోటీసు ఇచ్చారు.
- ఇది మీ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తున్నది.
- మీరు నాకు ఇచ్చిన గోడకు నోటీసు అతికించడం చట్టవిరుద్ధం.
- మీరు నాకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. చట్టం ప్రకారం నా స్టేట్మెంట్ ను ఎర్రవల్లిలోనే రికార్డ్ చేయాలి.
- అయితే చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నాను.
- రేపు 3.00 గంటలకు నందినగర్ లో అందుబాటులో ఉంటాను.
- మీరు నందినగర్ నివాసంలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పట్టుబట్టినందున అక్కడే అందుబాటులో ఉంటాను.
జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరిని ఉద్దేశిస్తూ కేసీఆర్ రాసిన ఆరు పేజీల పూర్తి లేఖను దిగువన చూడవచ్చు..

