Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

గులాబీ పార్టీ బాస్ వల్లే గుదిబండలా బనకచర్ల: సీఎం రేవంత్

బనకచర్ల ప్రాజెక్టు వివాదం ఆకస్మికంగా తెరమీదకు వచ్చింది కాదని, 2016 లో కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల మధ్య 2019లో పలు దఫాలుగా జరిగిన సమావేశాల్లో గోదావరి జలాలను రాయలసీమకు తరలించడానికి అభ్యంతరం లేదని చెప్పడం, ఇప్పుడు తెలంగాణకు గుదిబండలా మారిందన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు తీసుకున్న నిర్ణయాల పరిణామ క్రమంలోనే బనకచర్లకు బీజం పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై హక్కులు, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపడుతున్న బనకచర్ల లింక్ ప్రాజెక్టు, దాని పర్యవసానాలు, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం బాధ్యతగా రాజకీయ, న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. గోదావరి నుంచి రాయలసీమకు నీటిని తరలించాలని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రధానమంత్రితో సహా అందరినీ కలుస్తామన్నారు. గోదావరి జలాలను పోలవరం నుంచి బనకచర్ల ద్వారా తరలించడానికి కడుతున్న ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఇప్పటికే అభ్యంతరం తెలియజేశామన్నారు. ప్రధానమంత్రిని కూడా కలుస్తామన్నారు. ప్రాజెక్టుకు వివిధ సంస్థలు నిధులు సమకూర్చే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని, అలాగే ప్రాజెక్టుకు అనుమతించరాదని పర్యావరణ శాఖ మంత్రిని.. ఇలా సంబంధించిన శాఖలన్నింటినీ కలిసి అభ్యంతరాలను తెలియజేశామని సీఎం చెప్పారు.

తెలంగాణ ప్రయోజనాలను కాపడటంలో ప్రభుత్వం బాధ్యతతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. ఒక పద్ధతిలో ముందుకు వెళుతున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఈ విషయంలో అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు.. గురువారం ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ని కలిసి తెలంగాణకు జరగబోయే నష్టంపై మరోసారి వివరిస్తామన్నారు. రాజకీయాలకతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వ్యవస్థల వద్దకు వెళుతున్నామని, న్యాయం కోసం ఎవరినైనా కలుస్తామని చెప్పారు. రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పర్యావరణ, జలశక్తి వంటి వ్యవస్థలన్నింటితోనూ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని, అప్పటికీ న్యాయం దక్కకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. నీటి వాటాపై తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

ఎపెక్స్ కౌన్సిల్ సమావేశపు మినిట్స్ కాపీని చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ వరకు మొత్తంగా 300 టీఎంసీ తరలించుకుపోవడానికి ప్రణాళికలు వేశారని, గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీ, కృష్ణా జలాల్లో 558 టీఎంసీలపై చట్టబద్ధమైన హక్కులు కల్పించాలన్నారు. వరద నీటిని వినియోగిస్తామన్న వాదన తెలంగాణ హక్కులను కాలరాసినట్టేనని, గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన హక్కులు కల్పించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కట్టుకునే ప్రాజెక్టులపై ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “అన్ని పార్టీల ఎంపీలతో నిర్వహించిన ఈ సమావేశం రాజకీయాలకు తావులేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించాం. సహకరించాలని అన్ని పార్టీలను కోరాం..” అని చెప్పారు.

అఖిలపక్ష ఎంపీలతో సమావేశపు దృశ్యం

అంతకు ముందు గోదావరి, కృష్ణా జలాల వినియోగం, పోలవరం – బొల్లెపల్లి రిజర్వాయర్ నుంచి ప్రతిపాదిత బనకచర్ల (Banakacharla) రెగ్యులేటర్ వరకు నీటిని తరలించే ప్రాజెక్టు వివరాలను ఇంజనీరింగ్ నిపుణులు సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, సురేష్ షెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, కుందూరు జయవీర్ రెడ్డి, రామసహాయం రఘురామి రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.

Popular Articles