Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

‘ఫైర్ వర్క్స్’లో పేలుడు, ఆరుగురు సజీవదహనం

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని బాణాసంచా తయారీ కేంద్రంలో ఘోర పేలుడు ఘటన చోటుచేసుకుంది. రాయవరం మండలం కొమరిపాలెం గ్రామంలోని లక్ష్మీ గణపతి ఫైర్‌వర్క్స్ యూనిట్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన దుర్ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్రంగా గాయపడ్డారు. సమీప గ్రామాల ప్రజలు ఆ ఘోర దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం సంభవించిన సమయానికి యూనిట్‌లో సుమారు పదిహేను మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అనేక మందికి తప్పించుకునే అవకాశం లేకపోయింది.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే యూనిట్‌లో గల రసాయన పదార్థాలు, బాణాసంచా ముడి సరుకులు ఉండటం వల్ల మంటలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్థానిక ప్రజల సహకారంతో మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక విభాగం ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, యూనిట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామం మొత్తం విషాద వాతావరణంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. అధికారులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు. కాగా కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Popular Articles