Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

ఫార్మారంగంలో అమెరికా కంపెనీ భారీ పెట్టుబడులు

ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం సమావేశమైన ఎలీ లిల్లీ ప్రతినిధి బృందం ఈ మేరకు అంగీకారం తెలిపింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలీ లిల్లీ అండ్ కో (Eli Lilly and Co) ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్ తో పాటు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలి లిల్లీ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్ కేంద్రంగా కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అందుకోసం ఒక బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 9,000 కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించనుంది. ముఖ్యమంత్రితో చర్చల అనంతరం ఎలీ లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ ఎత్తున కార్యకలాపాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు తెలియజేసింది.

కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ ద్వారా సంస్థ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి విస్తరించాలన్న నిర్ణయంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంస్థను అభినందించారు. తెలంగాణపై విశ్వాసం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మా హబ్‌గా ప్రఖ్యాతి గడించిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

అదేవిధంగా 1965లో ఇందిరాగాంధీ ఐడీపీఎల్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడంతో ఫార్మా రంగం విస్తరించిందని గుర్తుచేశారు. పేరొందిన దిగ్గజ ఫార్మా కంపెనీలుండటంతో దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు.

ఎలి లిల్లీ హైదరాబాద్ నుంచి వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ ద్వారా రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్‌మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలకు అవకాశం ఏర్పడుతుంది. అమెరికాకు చెందిన ఎలి లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. ప్రధానంగా డయాబెటిస్‌, ఒబెసిటీ, ఆల్జీమర్‌, క్యాన్సర్‌, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది.

ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎలి లిల్లీ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆగస్ట్ నెలలో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్‌తో తెలంగాణలో ప్రతిభావంతులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Popular Articles