ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ తన ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ చనిపోయిన విషయం వాస్తవమేనని ఇరాన్ అధికారిక మీడియా కూడా ధ్రువీకరించింది. ఖమేనీ కుమార్తె, అల్లునితోపాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నలభై రోజులపాటు సంతాప దినాలు పాటించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఖమేనీ మృతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తుల్లో ఖమేనీ ఒకరని, అతని బాధితులకు న్యాయం చేశామని ట్రంప్ అన్నారు. ఖమేని మృతి ఘటన ఇరాన్ ప్రజలకే కాదు, అమెరికన్లకూ గొప్ప విజయంగా అభివర్ణించారు. ఇరానియన్లు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమని చెప్పారు. అమెరికా నిఘా కళ్ల నుంచి, అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ కు చెందిన ఇతర నాయకులు చేయగలిగిందేమీ లేదని, ఆ దేశ సైన్యం, పోలీసులు తమతో పోరాడాలనుకోవడం లేదని ట్రంప్ అన్నారు.

