Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

భూముల డిజిటల్ సర్వే: తెలంగాణా సీఎస్ కీలక ప్రకటన

తెలంగాణాలో భూముల డిజిట‌ల్ స‌ర్వేపై ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సర్వేకు సంబంధించి 17 కంపెనీల‌తో త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్ స‌మావేశం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ భూభాగంలోని ప్ర‌తి ఇంచు భూమిని కూడా డిజిట‌ల్ స‌ర్వే చేయిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో భూముల డిజిట‌ల్ స‌ర్వే చేప‌ట్ట‌డానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు మంగళవారం తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భవన్ లో వివిధ కంపెనీలతో ప్రాథమిక స్థాయి సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి నిర్వహించారు. భూముల డిజిటల్ సర్వే నిర్వ‌హించేందుకు ఆస‌క్తి చూపిస్తున్న 17 కంపెనీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఇతర రాష్ట్రాలలో నిర్వహించిన భూముల డిజిటల్ సర్వే సందర్భంగా తాము ఎదురుకున్న సమస్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయా కంపెనీలు వివరించాయి.

భూముల డిజిటల్ సర్వే పై ఈ కంపెనీలతో సీఎం కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. అలాగే భూముల డిజిటల్ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సర్వేకు పట్టే సమయం, వ్యయం, అందుబాటులో ఉన్న సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు, కావాల్సిన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, ఇంటర్నెట్ సామర్ధ్యం తదితర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగం కమీషనర్ అండ్ ఐ.జి. శేషాద్రి, టి.ఎస్.టి.ఎస్. ఎండి వెంకటేశ్వర్ రావు, సర్వే, సెటిల్మెంట్ & ల్యాండ్ రికార్డ్సు కమీషనర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Popular Articles