తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం పర్యటించారు. ఎర్రుపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పర్యటించి పలు అభివృద్ధి, నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఎర్రుపాలెం ఎస్సీ కాలనీలో రూ. 45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, పెద్ద గోపవరం గ్రామంలో 12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు, పెద్ద గోపవరం గ్రామం ఎస్సీ కాలనీలో 85 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు భట్టి శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా బుచ్చిరెడ్డి పాలెం గ్రామం ఎస్సీ కాలనీలో 40 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, బనిగండ్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలో కోటి 75 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, అయ్య వారిగూడెం ఎస్సీ కాలనీలో 55 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, భీమవరం గ్రామంలో 20 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. మధిర నియోజకవర్గం ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని, శాశ్వత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామానికి ఆధునిక మౌళిక వసతులను పూర్తి స్థాయిలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని, నియోజకవర్గ ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసే కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం ఆలోచిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
మధిర నియోజకవర్గం అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం సమీక్ష:
మధ్యాహ్నం బనిగండ్లపాడులో భోజన విరామం అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి రెవిన్యూ, ఫారెస్ట్, పంచాయతీ రాజ్, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, పర్యాటకశాఖ అధికారులతో నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వాటి పూర్తికి అధికారులు చేపట్టాల్సిన చర్యలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఆ తర్వాత ఎర్రుపాలెం మండలంలో మామునూరు గ్రామ పరిధిలోని ఇనిద్రమ్మ చెరువును ప్రత్యేకంగా ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు.

