Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

సీఎం పర్యటనలో రూ. 362 కోట్ల అభివృద్ధి పనులు: పొంగులేటి

ఖమ్మం: పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రూ. 362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈనెల 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సహా మొత్తం రూ. 362 కోట్ల పనులు సీఎం చేతుల మీదుగా తన నియోజకవర్గంలో ప్రారంభమవుతాయని చెప్పారు.

ఇందులో భాగంగానే మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారని పొంగులేటి చెప్పారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ను ప్రారంభిస్తారన్నారు. కూసుమంచిలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారని పొంగులేటి తెలిపారు.

కాగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. “గత ప్రభుత్వంలా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం మా అలవాటు కాదు.. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేసే ప్రభుత్వమిది” అని పొంగులేటి స్పష్టం చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు.

Popular Articles