Saturday, September 6, 2025

Top 5 This Week

Related Posts

రెవెన్యూ వ్యవస్థపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణా రెవెన్యూ వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని సీఎం అన్నారు. హైదరాబాద్ హైటెక్స్​లో శుక్రవారం నిర్వహించిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆరెస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా వారి సమస్య పరిష్కరించలేదన్నారు. రెవెన్యూ శాఖ సిబ్బందిని ఒక దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ చరిత్రలో పోరాటాలన్నీ భూమి కోసం జరిగినవేనని, కొమురంభీం, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి లాంటి వాళ్లు భూమి కోసమే పోరాడారని, భూమి కోసం పోరాటాలే కాదు భూదాన్ ఉద్యమానికి పునాదులు పడింది కూడా తెలంగాణ ప్రాంతంలోనేనని సీఎం పేర్కొన్నారు.

వెదిరె రామచంద్రారెడ్డి వేలాది ఎకరాలు పేదలకు పంచి భూదానోద్యమం చేశారని, ఆనాడు పీవీ నర్సింహారావు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచారని, భూమిని చెరబట్టిన వారిని తెలంగాణ ప్రజలు దిగంతాలకు తరిమారని అన్నారు. గత ప్రభుత్వంలో ధరణి భూతాన్ని తెచ్చి భూములను కొల్లగొట్టాలని చూశారని, తమ దోపిడీకి వీఆర్వో, వీఆర్ఏ లు అడ్డుగా ఉన్నారని భావించి వారిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని సీఎం అన్నారు. మిమ్మల్ని దోపిడీదారులుగా చిత్రీకరించారని రెవెన్యూ అధికారులను, సిబ్బందిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

ధరణి తెచ్చిన సమస్యలతో విసిగిపోయిన ఓ రైతు ఇబ్రహీంపట్నంలో అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని గుర్తు చేశారు. సిరిసిల్లలో అధికారులపై తాళి బొట్టు విసిరిన పరిస్థితి ఏర్పడిందని, ఇది అధికారుల వల్ల జరగలేదని, ఇది నాటి పాలకులు సృష్టించిన వైరస్ గా సీఎం అభివర్ణించారు. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఆనాడు చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం ధరణి మహమ్మారిని వదిలించి భూ భారతి చట్టం తీసుకొచ్చామని రేవంత్ చెప్పారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో పరిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పారు.

ప్రభుత్వానికి పేద ప్రజలకు మీరు వారధులుగా నిలవాలని జీపీవోలకు పిలుపునిచ్చారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మిమ్మల్ని తిరిగి నియమించామని, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఎవరో కొందరు తప్పులు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారని, లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయిందని, మరి వాళ్ళనేం చేయాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

తెలంగాణ సాధనలో, ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములైన మీరు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని కోరారు. భూ భారతి చట్టాలను అమలు చేయడమే కాదు.. సాదా బైనామాల సమస్య పరిష్కరించాలని, ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని, గత పాలకులు మిమ్మల్ని తెలంగాణా సమాజంలో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని, మీ మీద పడ్డ మచ్చను చెరుపుకునే అవకాశం మీకు వచ్చిందని సీఎం అన్నారు. ఆ ముద్రను చెరిపేసి.. ఆనాటి పాలకుల తప్పుడు విధానాలను ప్రజలకు వివరించాలని, మీపై చేసిన ఆరోపణలు తప్పని నిరూపించుకునేలా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని జీపీవోలకు సీఎం హితవు చెప్పారు.

Popular Articles