Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ప్రభుత్వ నిర్వహణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వాన్ని నడిపే అంశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదన్నారు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తానని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని ఆయన పిలుపునిచ్చారు.

ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు, ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మంది అభ్యర్థులకు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “విద్యార్థుల భవిష్యత్తుతో పాటు, తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ కంకణబద్ధులై పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర చాలా క్రియాశీలకమైంది. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి కనబరచలేదు. నియామకాలకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి వాయిదా పడుతుంటే ఒక్కొక్కటిగా చిక్కుముడులను విప్పుకుంటూ నియామకాలను పూర్తి చేశాం’ అని అన్నారు.

“ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో నియామక పత్రం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 57,946 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, తెలంగాణ ఉద్యమానికి పునాదిగా నిలిచిన నిరుద్యోగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్న సంతృప్తి తమకు ఉందన్నారు. ఒక్క ఏడాది కాలంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదని, ఇది తనకు ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భమన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 55 రోజుల్లో డీఎస్సీ నిర్వహించి 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. లోపాలను సరిదిద్దుకోవలసిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మిస్తున్నామని, తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని చెప్పారు.

ఉద్యోగాల్లో చేరిన తర్వాత స్కూళ్లు, కాలేజీల్లో మట్టిలో మాణిక్యాలను వెలికితీసి క్రీడాకారులను తయారు చేయాలన్నారను. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Popular Articles