మిర్యాలగూడ: విపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత..? అని సీఎం ప్రశ్నించారు. తన జాతికి మాత్రమే కేసీఆర్ పిత కావచ్చని, తమకు కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంశాన్ని ప్రస్తావిస్తూ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ముఖాలకు ముసుగు తొడిగి విచారణకు పోలీసులు తీసుకువచ్చేది ఉండాల్సిందని పేర్కొన్నారు. మిర్యాలగూడలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు విజయసూచికగా వేలాది మంది తరలివచ్చారు.
- సభలో ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడం చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఎదురులేదన్న విశ్వాసం కనిపిస్తోంది.
- ఈ ప్రభుత్వం గిరిజనులు, పేదలు, ఆదివాసీలు, నిరుద్యోగులు, మహిళలు , మైనార్టీల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చింది.
- మా ప్రభుత్వ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి.
- తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదు.
- ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది మందికి రేషన్ కార్డులు ఇచ్చాం.
- మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం.
- గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం బర్రెలకు దాణా పెట్టడానికి ఉపయోగపడ్డాయి.
- బుక్కెడు బువ్వ తినడానికి ఉపయోగపడలేదు.
- మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం పేదవారికి చేరాయి.
- సన్న బియ్యంతో వండుకుని తింటున్నవారందరూ కాంగ్రెస్ కు ఓటు వేయాలి.
- ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇళ్లలో వెలుగులే కాదు మీ కళ్లలో సంతోషం చూస్తున్నాం.
- వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తో పాటు ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
- రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ మిర్యాలగూడ.
- మిర్యాలగూడలో అత్యధికంగా వరి పండుస్తున్నారు.
- గతంలో ఆనాటి సీఎం వరి వేసుకుంటే ఉరే అన్నాడు.
- మా ప్రభుత్వం వచ్చాక సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం.
- బోనస్ తీసుకుంటున్న అత్యధిక లబ్దిదారులు మిర్యాలగూడలోనే ఉన్నారు.
- రైతు భరో సా కింద ప్రతి ఎకరాకు 6 వేల రూపాయలు ఇస్తున్నాం. 9 రోజుల్లోనే 9 వేల కోట్లు రైతులకు ఇచ్చాం.
- మున్సిపల ఎన్నికలు ముగియగానే రైతు భరోసా ఇస్తాం.
- త్వరలోనే రైతు భరోసా కిందనే తొమ్మిది వేల కోట్ల ఇస్తాం.
- రైతుల కోసం ఇప్పటి వరకు మా ప్రభుత్వం లక్షా పదివేల కోట్లు ఖర్చు చేసింది.
- తెలంగాణలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితప్రయాణం కల్పించాం.. .
- కోట్లాది మంది ఆడ బిడ్డలు అమ్మగారి ఇంటికైనా, అమ్మవారి గుడి కైనా ఉచితంగా వెళ్లున్నారు..
- ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసిన మహిళలు కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ, బీఆర్ఎస్ కు వాళ్లకు డిపాజిట్లు రావు.
- బీఆర్ఎస్, బీజేపీ తరుపున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం.
- బీఆర్ఎస్ నాయకులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఎక్కడా వివక్ష చూపించలేదు.
- బీఆర్ఎస్ నాయకుల పిల్లలు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ లో చదువు కోవచ్చు.
- రాష్ట్రంలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.
- వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించాం.
- డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ ఆనాడు ఊరించాడు.
- పదేళ్లు సీఎంగా ఉండి ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టుకున్నాడు.
- ఏ పేదవాడికి ఇళ్లు కట్టి ఇవ్వాలన్న ఆలోచన బీఆర్ఎస్ చేయలేదు.
- ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.
- దళారులు, దగా లేకుండా నేరు గా లబ్దిదారుల ఎకౌంట్ లోనే డబ్బులు వేస్తున్నాం.
- ప్రతి ఎమ్మెల్యే మాకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నారు.
- వచ్చే బడ్జెట్ లో కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నాం.
- నల్గొండ జిల్లా ప్లోరైడ్ ప్రాంతం.. ఈ సమస్యకు పరిష్కారం గతంలో దొరకలేదు.
- నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ పార్టీ కట్టినవే.
- ఎస్ ఎల్ బీసీ 30 కిలో మీటర్ల టన్నెల్ ను గత కాంగ్రెస్ ప్రభుత్వం తొవ్వింది.
- నల్గొండ జిల్లాపైన కోపం ,విషంతో ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేదు.
- ఎస్ఎల్బీసీని రెండేళ్లలో పూర్తి చేయడానికి ముందుకు వచ్చాం.. కాని అనుకోని ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారు.
- ఎస్ ఎల్ బీసీలో 8 మంది చనిపోతే మామ, అల్లుడు, బామ్మర్థి సంతోష పడ్డారు.
- కడుపులో విషం పెట్టుకున్నవాళ్లు మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటు వేయమని ఎలా అడుగుతారు?
- సిగ్గులేకుండా గంగిరెద్దుల్లా ఇంటి ముందుకు వస్తే కర్రు కాల్చి వాత పెట్టండి.
- గంజికి గతిలేనివాళ్లు బెంజ్ కార్లు కొన్నారు. అదంతా మందిని ముంచినదే.
- నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ కు అండగా నిలబడాలి.
- రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. రైతు రుణమాఫీ చేశాం.. రైతు భరోసా ఇచ్చాం.. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. 1,000 బస్సులకు మహిళలను యజమానులను చేశాం.
- మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు పెట్టించాం.
- 25 వేల కోట్లను సున్నా వడ్డీకి మహిళా సంఘాలకు ఇచ్చాం.
- ప్రజా ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యం అయింది.
- పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను దోచుకున్నారు.
- పెళ్లం మొగుడు మాట్లాడుకుంటే ఫోన్లు విన్నరు.
- జర్నలిస్టులు, సినిమా తారలు, జడ్జీలు ఎవరిని వదలకుండా ఫోన్లు విన్నారు.
- అన్నం తినేవాళ్లు ఎవరరైనా పెళ్లాం మొగుడు మాట్లాడుకుంటే వింటారా..?
- కొంత మంది జాతిపితను విచారిస్తారా అని అడుగుతున్నారు.
- ఎవరికి రా నువ్వు జాతి పితవు…? నీ జాతికి నువ్వు పిత కావొచ్చు.. మాకు కాదు.
- పెళ్లాం మొగుడు జోలి పెట్టుకుంటే విన్న సన్నాసి నువ్వు జాతిపితవా..?
- సిగ్గుతో తలదించుకోవాలి మీరు.
- కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ను మొఖాలకు ముసుగు తొడిగి విచారణకు పోలీసులు తీసుకువచ్చేది ఉండే..
- జాతిపిత అయితే మీరు సంపాదించుకున్న ఆస్తులు తెలంగాణ ప్రజలకు ఇస్తారా..?
- కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ , కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ , హరీష్ రావు మోయినాబాద్ ఫామ్ హౌస్ , టీవీలు, పేపర్లు, వేల కోట్లు తెలంగాణ ప్రజలకు ఇస్తారా..?
- సీఎం, మంత్రి, ఎమ్మెల్యే అన్ని పదవులు మీరే తీసుకున్నారు.
- తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు చిన్న పదవి కూడా ఇవ్వలేదు.
- తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతి పిత అవుతడు.
- ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అవుతుంది..
- లుచ్చా, సన్నాసి , దొంగ.. నువ్వెలా జాతి పిత అవుతావు..? తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి.
- నక్క జిత్తుల భాస్కర్ రావు మిర్యాలగూడలో ఉన్నాడు.
- జానారెడ్డి చెప్పులు మోసినవాడు.. నీళ్ల సీసాలు మోసినవాడు భాస్కర్ రావు..
- మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపిస్తే ఆత్మగౌరవాన్ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ పాదాల దగ్గర పెట్టాడు.
- మా అభ్యర్థులను బెదిరిస్తే భాస్కర్ రావు.. నీకు చింతపండు అవుతుంది.
- కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దు..
- జానారెడ్డిని ఓడించడానికి భాస్కర్ రావు ఇంటింటికి తిరిగాడు..
- నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీల్లో విజయంపైన నాకు నమ్మకం ఉంది.
- తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలు గెలవాలి.
- తెలంగాణలో మున్సిపాలిటీల్లో 17,472 కోట్లు ఖర్చు పెట్టాం.
- నల్గొండ జిల్లా మున్సిపాలిటీల్లో 2028 కోట్లు ఖర్చు పెట్టాం.
- మిర్యాలగూడ మున్సిపాలిటీలో 295 కోట్ల ఖర్చు చేశాం.
- మున్సిపల్ శాఖ నా దగ్గరే ఉంది.. మున్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్యత.
- వడ్డించే వాడు మనవాడు.. అలాగే అడిగే వాడు మన వాడు ఉండాలి.. మనోడు అయి ఉండాలి.
- ఇంకా 8 ఏళ్లు అధికారంలో ఉంటాం.. మున్సిపాలిటీలను అద్దంలా తీర్చిదిద్దుతాం.
- కాంగ్రెస్ గెలిస్తే పేదవాడు గెలిచినట్లు.
- అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలి.
- గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు దేనికైనా పనికి వచ్చాయా..? సారె పెట్టినట్లుగా ఆడబిడ్డలు ఇందిరమ్మ చీరలు కట్టుకుని వచ్చారు.
- జమ్మికి వచ్చిన పాలపిట్టల్లా ఇందిరమ్మ చీరల్లో ఆడబిడ్డలు కనిపిస్తున్నరు.
- ఓటేసే ముందు సన్నబియ్యం, రేషన్ కార్డు, రైతు భోరోసా,రుణమాఫీ, బస్సు ప్రయాణం, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు , ఇందిరమ్మ ఇళ్లను గుర్తు చేసుకోండి.
- ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది.
- 123 మున్సిపాలిటీల పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.

