ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘కానిస్టిట్యూషనల్ ఛాలెంజెస్… పర్స్పెక్టివ్స్ అండ్ పాథ్వేస్’ సదస్సులో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..:
- ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఉంది. బ్రిటిష్ వాళ్లతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని బీజేపీ వాళ్లకు గుర్తు చేస్తున్నా.
- ఇందిరాగాంధీ పాకిస్తాన్ ను యుద్ధంలో ఓడించి రెండు ముక్కలు చేసి కాళీ మాతాగా గుర్తింపుపొందారు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని ఇందిరాగాంధీ రక్షించింది. ఉగ్రవాదుల నుంచి రక్షించే క్రమంలో ఇందిరాగాంధీ ప్రాణాలు త్యాగం చేశారు.
- ఉగ్రవాదంపై పోరులో రాజీవ్ గాంధీ అమరత్వం పొందారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ, బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుంది.
- కాంగ్రెస్ ఏం చేసిందని పదే పదే బీజేపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు.. ఈ దేశం కోసం గాంధీజీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారు.
- 2004లో కేంద్రంలో యూపీఏ-1 అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి పదవిని స్వీకరించాలని అంతా సోనియా గాంధీని కోరినప్పటికీ, ఆమె దానిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేశారు. రాష్ట్రపతి అవకాశం వచ్చినా వదులుకొని ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి చేశారు.
- రాహుల్ గాంధీ అనుకుంటే 2004లోనే కేంద్ర మంత్రి, 2009లోనే ప్రధానమంత్రి అయ్యే వారు. కానీ ఆ రెండింటిని ఆయన త్యాగం చేశారు. త్యాగాలు కాంగ్రెస్కు కొత్త కాదు, సామాన్య కార్యకర్తగానే రాహుల్ కొనసాగుతున్నారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, సామాజిక న్యాయం కోసం 25 ఏళ్లుగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారు.
- 2001 నుంచి నరేంద్ర మోదీ కుర్చీ వదలడం లేదు. ముఖ్యమంత్రి అయింది మొదలు ఇప్పటి వరకు కుర్చీ వదలడం లేదు. ఆర్ఎస్ఎస్ చెప్పినా మోదీ వినడం లేదు.
- రెండు నెలల క్రితం ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ 75 ఏళ్ల నిండిన వారు కుర్చీ వదలాలని చెప్పినా మోదీ వదులుకునేందుకు సిద్దంగా లేరు. అద్వాణీ, మురళీ మనోహర్ జోషికి వర్తించే నిబంధనలు మోదీకి వర్తించవా..?
- మోదీని ఆర్ఎస్ఎస్, వాజ్పేయీ కుర్చీ నుంచి దింపలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోదీని కుర్చీ నుంచి దింపేస్తారు.
- మోదీ లేకుంటే బీజేపీకి 150 సీట్లు కూడా రావని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ప్రకటించారు. దూబే తన డైరీలో రాసుపెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని పోరాడతాం, బీజేపీకి 150కి మించి ఒక్క సీటు రాదు.
- మోదీని ఓడించేందుకు, మోదీని కుర్చీ నుంచి దింపేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులన్నీ పోరాడతాయి.
- ఓబీసీలకు సామాజిక న్యాయం సాధించేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో మేం పోరాడతాం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. ఆ సమయంలో తెలంగాణలో కుల గణనకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు ఆయనకు బాసటగా తెలంగాణ ప్రజలు ప్రేమ దుకాణాలు (మొహబ్బత్ కా దుకాణ్) తెరిచారు. అందుకే మేం తెలంగాణలో కుల గణన చేశాం. దేశానికి తెలంగాణ మోడల్ ఇచ్చాం.
- దేశంలో సామాజిక న్యాయం కోసం, కుల గణన కోసం… ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు నూతన సామాజిక న్యాయం సాధనకు రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాడతాం.
