ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి మహదేవుడిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపైనా ఉండాలని ప్రార్థించారు. హైదరాబాద్ నగర చరిత్రలో గడిచిన 71 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు, కష్టాలొచ్చినా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలను జరుపుతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను ఒకసారి చేయడమే కష్టమవుతున్న ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలొచ్చినా తట్టుకుని నిలబడి నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణపతికి పోటీ లేదన్నారు.
హైదరాబాద్లో 1 లక్షా 40 వేల విగ్రహాలను ప్రతిష్టించుకుని ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని సీఎం చెప్పారు. భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా నగరంలో పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఇతర శాఖలు తోడ్పాటును అందిస్తున్నాయన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్యాంక్బండ్తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
