Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

రక్షణ మంత్రితో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయించాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో ఆయన నివాసంలో బుధవారం స‌మావేశ‌మ‌య్యారు.

మూసీ, ఈసా న‌దుల సంగ‌మ స్థ‌లిలో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌ట్ట‌నున్న‌ ప్రణాళికపై ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి సమగ్రంగా వివ‌రించారు. ఈ రెండు న‌దుల సంగ‌మ స్థ‌లంలో గాంధీ స‌ర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేప‌డ‌తామ‌ని, ఇందుకు అక్క‌డ ఉన్న 98.20 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూములు రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించాల‌ని కోరారు. జాతీయ స‌మైక్య‌త‌, గాంధేయ విలువ‌ల‌కు సంకేతంగా ప్రతిష్టాత్మకంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం మ్యూజియం నిర్మిస్తామ‌ని వివ‌రించారు. రాజ్‌నాథ్ సింగ్ తో జరిగిన స‌మావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, క‌డియం కావ్య‌, మూసీ రివ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఇవి న‌ర‌సింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, ప‌థ‌కాల స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ పాల్గొన్నారు.

నేపాల్ పరిణామాలు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్:
కాగా ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేయనుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్‌లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

నేపాల్‌లో ఎవరైనా తెలంగాణ పౌరులు చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఈ కింది నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.
📞 శ్రీమతి వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రెటరీ & లైజన్ హెడ్ +91 9871999044.
📞 శ్రీ జి రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ +91 9643723157.
📞 శ్రీ సిహెచ్ చక్రవర్తి, ప్రజా సంబంధాల అధికారి +91 9949351270.

తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించింది. తెలంగాణ పౌరులకు నేపాల్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.

Popular Articles