Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

పైసల్లేవని ప్రజల్ని ‘ప్రిపేర్’ జేస్తున్నట్టేనా..!?

రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల వంటి అనేక అంశాలను కూడా సీఎం ప్రస్తావించారు. నిధుల లేమి వల్లే ఒక్కో నెలలో ఒక్కో వర్గానికి, లేదా ఒక్కో విభాగపు ఉద్యోగులకు జీతభత్యాలు నిలిపేస్తూ, రైతుభరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల నిధుల విడుదలను సాగదీస్తూ సర్కారును నడుపుతున్నట్లు సీఎం వివరించారు. ప్రభుత్వ నిర్వహణ ఎలా సాగుతోందనే అంశాన్ని ఇంకా క్లియర్ గా చెప్పే యత్నంలో భాగంగా.. అవసరానికి సరిపడా ఆదాయం లేని కుటుంబ నిర్వహణలో ఇల్లు కిరాయ, పాల పైసలు, పిల్లల స్కూలు ఫీజులను సర్దుబాటు చేసే గడ్డు స్థితిని ఆసక్తికరంగా ప్రస్తావించారు. మొత్తంగా ‘ఊపర్ షేర్వాణీ, అందర్ పరేషానీ’ ఉర్దూ నానుడిని ఉటంకిస్తూ రాష్ట్ర అప్పులు, వడ్డీలు, కిస్తీలు, ఆదాయం లెక్కలను ఖుల్లం ఖుల్లగా వివరించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అంతేకాదు ‘అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను’ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో రెండ్రోజుల క్రితం ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో సీఎం రాష్ట్ర ఆర్థిక స్థితిపై చెప్పిన మాటలకు కొనసాగింపుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు కూడా వల్లె వేస్తుండడం గమనార్హం.

ఉద్యోగులకు, పదవీ విరమణ చెందినవారికి చెల్లించాల్సిన పెండింగ్ నిధులను ఏ ప్రాతిపదికన విడుదల చేయాలో చెప్పాలని ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాజాగా ఉద్యోగ సంఘాలను కోరారు. అంతకు ముందు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిధుల లేమి అంశాన్ని ప్రస్తావించారు. తన నియోజకవర్గ పర్యటనలో పొంగులేటి మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, అయినప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ ఛానల్ విధానం ద్వారా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఈ విధంగా మరికొందరు మంత్రులు సైతం ప్రభుత్వం వద్ద నిధులు లేవనే అంశాన్ని తమ పర్యటనల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రైతు భరోసా నిధుల చెల్లింపు గడువునకు మరో 17 రోజులు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో, రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదనే ఆరోపణల పరిణామాల్లో సీఎం నుంచి మంత్రులే కాదు, ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు కూడా పదే పదే ప్రజల ముందు రాష్ట్ర ఆర్థిక స్థితిని గుర్తు చేస్తుండడం గమనార్హం. దీంతో సర్కారు వద్ద పైసల్లేవంటూ ప్రజలను మానసికంగా సంసిద్ధం చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా ఉద్భవిస్తున్నాయి. అయితే సీఎం నుంచి మంత్రుల వరకు చేస్తున్న ఈ వాదనపై ప్రజల్లో ఎటువంటి స్పందన లభిస్తుందనే అంశంపైనే భిన్నాభిప్రాయాుల వ్యక్తమవుతున్నాయి.

Popular Articles