Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఢిల్లీలో పార్టీ అగ్ర నేతలను కలిసిన సీఎం రేవంత్, మంత్రులు

ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు గురువారం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిశారు. రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేయాలనే దృఢ సంకల్పంతో ఆయా నాయకులు పార్టీ అగ్రనేతలను కలిసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించినట్లు ఆ ప్రకటన పేర్కొంది.

ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్, దాని వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, కీలక వాగ్దానాల అమలు, విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి పురోగతి, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు, నిర్మాణాత్మక సంస్కరణలపై అధిష్ఠానానికి సమగ్రంగా వివరించారు. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ముఖ్యమంత్రి రేవంత్ పునరుద్ఘాటించారు.

డిసెంబర్ 2023లో ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ కొలువుదీరినప్పటి నుంచి మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం చేపట్టిన విప్లవాత్మక చర్యలను నాయకత్వానికి వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, జిల్లాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తున్న విశేష ప్రజా మద్దతు, తదితర అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వం తెలంగాణ సమగ్ర, సమాన అవకాశాల అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.

Popular Articles