బీజాపూర్: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని పశ్చిమ బస్తర్ అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు (డీఆర్జీ) పోలీసులు, ఏడుగురు నక్సలైట్లు మరణించారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా విభాగాలకు చెందిన భద్రతా బలగాలు నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కాల్పుల్లో ఇప్పటి వరకు డీఆర్జీ విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లు, ఏడుగురు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నాయి. ఘటనలో మరో డీఆర్జీ జవాన్ కూడా గాయపడినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
నక్సలైట్ల కాల్పుల్లో మరణించిన డీఆర్జీ సిబ్బందిలో హెడ్ కానిస్టేబుల్ మోను వాడాడి, కానిస్టేబుల్ డుకారు గోండెగా గుర్తించారు. అదేవిధంగా సోమ్ దేవ్ యాదవ్ అనే మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన నక్సలైట్లను గుర్తించాల్సి ఉందని, ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్, 303 వంటి తుపాకులతోపాటు ఇతరత్రా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా ఎన్కౌంటర్ ఘటనను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ లు ధ్రువీకరించారు.
Update:
కాగా ఈ ఎన్కౌంటర్ ఘటనలో మృతుల సంఖ్య పెరిగినట్లు సాయంత్రం 6.30 గంటలకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. అధికారికంగా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.

