ఖమ్మం: తన వెనుక మంత్రి ఉన్నాడంటూ అసభ్య పదజాలంతో దూషణకు దిగి, వివాదాస్పదాస్పదమైన ఖమ్మం జిల్లాలోని ఓ టీచర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు నేలకొండపల్లి మండలం సుర్ధేపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న టి. లక్ష్మణ్ రావును సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి, అదనపు కలెక్టర్ శ్రీజ శనివారం ప్రకటించారు. ప్రస్తుతం లక్ష్మణ్ రావు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు.
లక్ష్మణ్రావు తనకు కేటాయించిన హెడ్క్వార్టర్ ను వదిలి కొణిజర్ల సమీపంలోని క్రాకర్స్ దుకాణానికి వెళ్లి, ఇతరులతో కలిసి వాగ్వావాదానికి దిగడంతోపాటు, అసభ్యపదజాలంతో దూషించి, సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసిన ఆరోపణలపై కొణిజర్ల పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయినట్లు జిల్లా విద్యాధికారి వివరించారు. తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు, తన చట్టబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, శాఖ ప్రతిష్టను భంగపరిచే చర్యలకు పాల్పడినిందుకు లక్ష్మణ్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఉత్తర్వు కూడా జారీ చేసినట్లు శ్రీజ తన ప్రకటనలో పేర్కొన్నారు.