ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు స్టేషన్లలో నెలకొన్న రైల్వే సంబంధిత సమస్యలపై ఢిల్లీలో సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినతి పత్రం సమర్పించారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దామోదర్ రావులు రైల్వే మంత్రిని కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
భద్రాచలం రోడ్ స్టేషన్ (కొత్తగూడెం) నుంచి హైదరాబాద్ కు కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైళ్లతో పాటు, అదనంగా మరికొన్ని రైళ్లు నడపాలని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి ప్రత్యేక రైలు నడపాలని కోరారు. అదేవిధంగా గాంధీపురం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం ఎత్తు పెంచి, ఆధునీకరణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కారేపల్లి స్టేషన్ ను అభివృద్ధి చేయడం తో పాటు గతంలో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ ను పునరుద్ధరించాలని కోరారు. ఖమ్మం స్టేషన్లో బీహార్, జైపూర్ వెళ్లే రైళ్లను ఆపాలని వినతిపత్రంలో కోరారు. బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఆయా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

