భూ భారతి చట్టంపై ఈనెల 14వ తేదీన కీలక దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని తెలంగాణా ప్రజలకు అంకితం చేయనున్నామని వెల్లడించారు. శుక్రవారం భద్రాద్రి జిల్లా మణుగూరులోని పినపాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ , ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే ఒక మైలురాయిగా పేదవాడికి కష్టంతో సంపాదించుకున్న భూములను భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారతి చట్టం – 2025 అన్ని జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఈ సభకి ఆహ్వానించి, రాష్ట్రంలోనీ మారుమూల ప్రాంతంలో ఉండే భూములను వాటి ఆసాములకు అందించేందుకు ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
కాగా ప్రభుత్వంపై ఎంతమంది, ఎన్ని శక్తులు కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ధరణి ప్రవేశ పెట్టి ఒక కోటి 57 లక్షల ఎకరాలను విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. ధరణి మూడేళ్ల పాటు అమల్లో ఉన్నా రూల్స్ ను రూపొందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భూభారతి చట్టంలో అనతి కాలంలోనే రూల్స్ ను రూపొందించామని తెలిపారు. దీని ద్వారా చిన్న సమస్య కూడా క్షణాల్లో పరిష్కారమయ్యే అవకాశం ఉందని పొంగులేటి అన్నారు.
కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ, బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
