Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

రోడ్డుపై మరో పోలీస్ డెడ్ బాడీ

ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో మరో పోలీసు జవాన్ డెడ్ బాడీ రోడ్డుపై కనిపించిన ఉదంతమిది. గత నెల 28న కనిపించకుండాపోయిన ఓ హెడ్ కానిస్టేబుల్ అయిదు రోజుల తర్వాత రోడ్డుపై నిర్జీవంగా పడి ఉండడం స్థానికంగా కలకలానికి దారి తీసింది.

బీజాపూర్ జిల్లా కుత్రు పోలీస్ స్టేషన్ కు చెందిన ఏఎస్ఐని మావోయిస్టులు కిడ్నాప్ చేసి అతని డెడ్ బాడీని రోడ్డుపై పడేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరువక ముందే అదే తరహా ఉదంతం చోటు చేసుకోవడం గమనార్హం.

దంతెవాడ జిల్లాలోని బోడ్లీ క్యాంపునకు చెందిన హెడ్ కానిస్టేబుల్ కనేశ్వర్ నేటం గత నెల 28వ తేదీన మిస్సయ్యాడు. మానసిక ఒత్తిడి వల్ల కనేశ్వర్ క్యాంపు నుంచి పరారయ్యాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఘటన జరిగిన ఐదు రోజుల అనంతరం అతని మృతదేహాన్ని రోడ్డుపై పోలీసులు కనుగొన్నారు.

పుస్పాల్-బోడ్లీ మధ్య దట్టమైన అడవుల్లో నక్సలైట్లు కనేశ్వర్ ను కిడ్నాప్ చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు. అయితే కనేశ్వర్ ను నక్సలైట్లే చంపారా? లేక గ్రామస్తులు పొట్టనబెట్టుకుని ఉంటారా? అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనను దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు.

Popular Articles