Top 5 This Week

Related Posts

‘ఎవరి రాజధాని?’… అప్పటి వక్తల వక్కాణింపు… తప్పక చదవాల్సిందే!

అమరావతిని రాజధానిగా 2014 డిసెంబర్ లో ప్రభుత్వం ప్రకటించినప్పుడు మొదట స్పందించింది, భయపడింది, ఆందోళన చెందింది వేలాదిగా ఉన్న రైతు కూలీలు. ఆ తర్వాత కౌలు రైతులు. చివర్లో చిన్న, సన్నకారు రైతులు. ఆ తర్వాతనే మేధావులు, పర్యావరణవేత్తలు, సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలు గొంతు విప్పారు.

రాజధానిగా అమరావతి పనికి రాదన్నవారు ఉన్నారు. బహుళ పంటలు పండే భూముల్లో భవనాలేంటి అన్నవారు ఉన్నారు? లక్షలాది పేద ప్రజలకు ఉపాధి పోతుంది అని ఆందోళన చెందినవారు ఉన్నారు.

నగర నిర్మాణంపై ప్రభుత్వ ఆలోచనలు బయటకు వస్తుంటే ఇలాంటి రాజధాని అవసరమా? లోటు బడ్జెటు రాష్ట్రానికి ఇంత ఖర్చు అవసరమా? అనే ప్రశ్నలతో పాటు అసలు అమరావతి ప్రజలకు సంబంధించింది కాదు అని ప్రకటించేశారు.

ఇందులో అవినీతి ఉందన్నవారూ ఉన్నారు. అన్యాయం జరిగిందన్నవారూ ఉన్నారు. వ్యతిరేకిస్తున్నాం అన్నవారు ఉన్నారు. అసలు ఈ రాజధాని వద్దూ అన్నవారూ ఉన్నారు.

ఈ పుస్తకంలోని కొన్ని అంశాలపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐ వై ఆర్ కృష్ణారావు ‘ఎవరి రాజధాని అమరావతి’ అంటూ ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ప్రముఖ రైతు నాయకుడు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావుకు అంకితం ఇచ్చారు. పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సిపిఎం కార్యదర్శి పి మధు, సిపిఐ కార్యదర్శి కే రామకృష్ణ ప్రసంగించారు. ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సి రామచంద్రయ్య సభకు అధ్యక్షత వహించారు. సభలో దాదాపు అందరు వక్తలూ ఆరోజు చెప్పింది ఒక్కటే… ‘అమరావతి అందరిదీ కాదు. కొందరిదే. రాజధానిగా అమరావతి అనువైనది కాదు’

ఇలాంటి అభిప్రాయం నాడు వెలిబుచ్చిన ఈ నేతలంతా ఇప్పుడేమంటున్నారో నేను చెప్పాల్సిన పనిలేదు. వారే జవాబు చెప్పాలి.

-దారా గోపి @fb

Popular Articles