(సమీక్ష ప్రత్యేక కథనం)
తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం గులాబీ పార్టీ నాయకులే కాదు, ఆ పార్టీకి చెందిన కరదీపిక ‘నమస్తే తెలంగాణ’ ముఖ్యులు కూడా బహుషా తీవ్ర డిసప్పాయింట్ కు గురై ఉండొచ్చు. నైనీ బొగ్గు గని వ్యవహారం నుంచి సింగరేణి కోల్ టెండర్ల వరకు సాగిన వివాదంలో భట్టి మాట్లాడిన తీరు ఆద్యంతం ఆసక్తికరమనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ తన పత్రికలో రాసిన ‘సంచలన’ వార్తా కథనం, ఆతర్వాత పరిణామాల్లో భట్టి తీవ్ర మనస్తాపం చెందారని, ‘బామ్మర్ది’ గుట్టు తవ్వుతున్నారని ‘నమస్తే తెలంగాణ’ పలు వార్తా కథనాలను తన పాఠకులకు అందించింది.
గత ఆదివారం ఏబీఎన్ రాధాకృష్ణ రాసిన వార్తా కథనం అనంతరం చోటు చేసుకున్న అనేక పరిణామాల తర్వాత శనివారం భట్టి విక్రమార్క ప్రజాభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణకు బాహాటంగానే స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పక తప్పదు. రాధాకృష్ణను ఉద్ధేశించి భట్టి చేసిన వ్యాఖ్యలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇంతకీ తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏబీఎన్ రాధాకృష్ణ రాతలపై ఏమన్నారంటే..

‘‘ తెలంగాణాకు సింగరేణి ఆత్మ వంటిది.ఇటువంటి సంస్థపై కొన్ని కట్టుకథలు, రాతలు, లేఖలు, రివ్యూలు వచ్చాయి. సింగరేణిలో పనిచేస్తున్న 42 వేల మంది పర్మినెంట్, 30 వేల మంది ఔట్ సోర్సింగ్ కార్మికుల ఆత్మ స్థయిర్యం దెబ్బతీసేవిధంగా, రకరకాల అపవాదులు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రధానంగా పెట్టుబడులు, కట్టుకథల, విషపు రాతల రాధాకష్ణగారు లేపిన తెరతో మొదలైన తప్పుడు ప్రచారం, నిందలు, ఊహాగానాలు కథనాలు, వాటిని అల్లుతూ రోజుకో కథ వండి వార్చడం జరుగుతోంది. రాబందులు, గద్దలు, దోపిడీదారుల ప్రయోజనాలకోసం ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయోనని చిన్నపుడు వినేవాడిని. ఈ రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియదు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపే క్రమంలో రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకోవాలంటే పత్రికాధిపతిగా రాధాకృష్ణ, డిప్యూటీ సీఎంగా నేను స్కోర్ సెటిల్ చేసుకుందాం. అడ్డగోలుగా, నా చేతిలో.. నేను అధిపతిని, నేను రాస్తే ఏదైనా నడుస్తది.. అని రాస్తున్నారంటే కుదరదండీ? నేను చెప్పదల్చుకున్నా స్పష్టంగా, నేను ఆస్తులు సంపాదించుకోవడానికో, వ్యవస్థలమీద పెత్తనం చెలాయించడానికో, సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికో రాలేదు. సమాజంలో మార్పుల కోసమే రాజకీయాలోకి వచ్చాను. అది చట్టసభల ద్వారా సాధ్యమవుతుందని భావించే చట్టసభకు వచ్చాను.

ఈ విషయంలో ఏవేని అనుమానాలు ఉంటే 24 గంటలు నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. పెద్దలు రాధాకృష్ణ గారు ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి.. మీమీద గౌరవం ఉంది. రాసిన కథనాలన్నీ తప్పుడని, వాటిపై వాస్తవాలను తిరిగి ప్రపంచానికి, తెలంగాణా సమాజానికి తెలియజేస్తారని ఆశిస్తున్నా, అలా జరగనప్పుడు నా పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా, 40 ఏళ్లుగా పోగేసుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేశారు మీరు.. ఇది తగదండీ మీకు.. ఇది తగదు. నా ప్రయాణం సుదీర్ఘం.. ఇక్కడికి రావడానికి, అనేక కష్ట, నష్టాలకు తట్టుకుని వచ్చాను. ఎంచుకున్న లక్ష్యం కోసం, సంకల్పం కోసం వచ్చాను, చిల్లర పనులకోసం, కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైన ఆలోచనలు, భావాలు ఉన్నాయి. నేను పోగేసుకున్న వ్యక్తిత్వాన్ని ఒక్కరోజుతో, ఒక్క కలంతో రాస్తానంటే నేను చూస్తూ ఊర్కోవడానికి సిద్దంగా లేను. నేను వ్యక్తిగతంగా అడుగుతున్నా.. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను., దయచేసి ఇప్పటికైనా మీరు రాసినదాన్ని పొరపాటని, తిరిగి ఈ వాస్తవాలను ప్రచురిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు, థాంక్యూ..’’ అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఇదే దశలో సీఎం రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్క ఈ అంశంలో పూర్తి అండగా నిలవడం గమనార్హం. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు పదే పదే ప్రస్తావిస్తున్న ‘బామ్మర్ది’ అంశంపైనా భట్టి విక్రమార్క పలు ప్రశ్నలను సంధించారు. ‘సృజన్ రెడ్డిని సీఎం బావమరిదిగా పేర్కొంటూ అతనికి బొగ్గుగనులు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని లేఖ రాశారు. నేనడుగుతున్నాను.. ఎవరీ సృజన్ రెడ్డి? అని ప్రశ్నించారు. ‘ఈ సృజన్ రెడ్డి కంపెనీ పేరు శోధ కన్ స్ట్రక్షన్స్, ఆ కంపెనీ ఎండీ దీప్తిరెడ్డి, ఈమె టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కుమార్తె. ఆయన అల్లుడే సృజన్ రెడ్డి’ అని భట్టి వివరించారు.

ఈ ఉపేందర్ రెడ్డి తాను సీఎల్పీ లీడర్ గా ఉన్నపుడు తనతోపాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచిన వ్యక్తి అని, బీఆర్ఎస్ నాయకులు అతన్ని ప్రలోభాలకు గురి చేశారన్నారు. తద్వారా ఆ టెండర్, ఈ టెండర్, ఆ కాంట్రాక్టు, ఈ కాంట్రాక్టు అని బీఆర్ఎస్ పార్టీ తీసుకువెళ్లిన ఉపేందర్ రెడ్డి అల్లుడీయన.. అని భట్టి పేర్కొన్నారు. ‘ఇప్పటికీ ఉపేందర్ రెడ్డి మీ దగ్గరే ఉన్నడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటరు మీరు? ఇదే కంపెనీకి 2023లో అక్టోబర్ లో కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందులో సీఎంకు ఏం సంబంధం. కాంగ్రెస్ పార్టీలో గెల్చిన వ్యక్తిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుని, వర్కులు ఇచ్చి ఆ బురదను మాకు పూయాలని ప్రయత్నిస్తే ఎట్ల?’ అని భట్టి సూటిగా ప్రశ్నించారు.

కళ్యాణఖని, మందమర్రి వంటి ఐదు కాంట్రాక్టలు పనులు ఆర్వీఎస్ ఆర్ కంపెనీకి ఇచ్చారని, ఈ కంపెనీకి చెందిన కీలక వ్యక్తి దీక్షిత్ రావు, విద్యాసాగర్ రావు ఎవరో అందరికీ తెలుసు.. అన్నారు. అదేవిధంగా నిశాంత్ రావు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు కుమారుడు. ఇతను ఎవరికి బంధువో అందరికీ తెలిసిందే. సృజన్ రెడ్డి నుంచి నలుగురు కంపెనీలు కాంగ్రెస్ వాళ్లకు చెందిన సంస్థలా? అని కూడా భట్టి ప్రశ్నించారు. ఓబీ కాంట్రాక్టు టెండర్లలో మొత్తం 25 కాగా, అందులో 20 వరకు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, సైట్ విజిట్ కండిషన్ ఇప్పటిది కాదని పేర్కొన్నారు. సైట్ విజిట్ నిబంధనకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను భట్టి ఈ సందర్భంగా ప్రదర్శించారు.

ఇక చివరగా ఈ అంశంలో భట్టి మాట్లాడుతూ, ‘పదే పదే సృజన్ రెడ్డి, సీఎం బావమరిది దోచుకుంటున్నారని చెబుతున్నారని, హరీష్ రావు గారూ? పదేళ్లు మీరు మంత్రిగా చేశారు. మీరంటే గౌరవం కూడా.. కానీ అసలు మీకేం కావాలి? ఏం కావాలి మీకు? వీటి మీద ఎంక్వయిరీ కావాలా? వాళ్లకూ వీళ్లకూ ఎందుకు రాస్తారు? నాకు రాయండి.. 2014 నుంచి నైనీ టెండర్ల వరకు ఎంక్వయిరీ చేయాలని, సిట్ వేయాలని రాయండి, డిప్యూటీ సీఎంగా, ఇంధన శాఖ బాధ్యునిగా, సీఎం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు, ఆయన తిరిగి రాగానే, స్వయంగా ఒప్పించి తాడిచెర్ల ఓబీ కాంట్రాక్టు సహా అన్నింటిపైనా నేనే విచారణ చేయిస్తా..’ అని భట్టి విక్రమార్కపేర్కొన్నారు.
మొత్తంగా నైనీ బొగ్గు గనుల వివాదం, సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంపై అటు ఏబీఎన్ రాధాకృష్ణ, ఇటు ‘నమస్తే తెలంగాణ’ పత్రిక రాసిన వార్తా కథనాలు, సీఎం ‘బామ్మర్ది’గా పేర్కొంటూ సృజన్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్, హరీష్ రావులు చేసిన ఆరోపణలన్నింటికీ కలిపి భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు ఆద్యంతం చర్చనీయాంశంగా మారడం విశేషం.

