బళ్లారి: కర్నాటకలోని బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నగరంలోని గాలి జనార్ధన్ రెడ్డి ఇటి వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. వీరిలో పోలీసులు కూడా ఉన్నారు. వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా బ్యానర్ల ఏర్పాటు అంశంలో గత అర్ధరాత్రి బీజేపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ ఏర్పడింది. రాళ్లు, బీరు సీసాలతో గాలి జానర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో రాజశేఖర్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అయితే జనార్ధన్ రెడ్డి జరిపిన కాల్పుల్లోనే యువకుడు మరణించినట్లు ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆరోపించారు. బ్యానర్ విషయంలో ఘర్షణ జరిగినట్లు తెలుసుకుని తాను వచ్చానని, తనపైనే కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని గాలి జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి కుటుంబంపై నేరారోపణలు చేస్తూ, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీల సామ్రాజ్యాన్ని నిర్మిస్తోందని గాలి జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా ఈ ఘటన సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత, అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రాళ్లు, బీరు సీసాలతో ఇరువర్గాలు జరుపుకున్న దాడుల్లో గాయపడిన పోలీసులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బళ్లారిలో కాల్పుల ఘటనపై కేసు నమోదైంది. గాలి జనార్ధన్రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్రెడ్డి సహా 11 మందిపై బ్రూస్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫొటో: బళ్లారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి మద్ధతుదారులు పేల్చినట్లు ఆరోపిస్తూ తుపాకీ తూటాను చూపుతున్న గాలి జనార్ధన్ రెడ్డి
ఫొటో క్రెడిట్: శ్రీధర్ కావలి (ది హిందూ సౌజన్యంతో..)

